Begin typing your search above and press return to search.

పౌరసత్వ చట్టం పై స్టే ఇవ్వలేం..సుప్రీంలో కేంద్రానికి ఊరట!

By:  Tupaki Desk   |   18 Dec 2019 7:48 AM GMT
పౌరసత్వ చట్టం పై స్టే ఇవ్వలేం..సుప్రీంలో కేంద్రానికి ఊరట!
X
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంలో దాఖలైన పిటిషన్ల పై నేడు విచారించిన సుప్రీం కోర్టు కేంద్రానికి నోటిసులు ఇచ్చింది. కానీ నూతన చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జనవరి రెండో వారంలో కేంద్రం తన స్పందనను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ.. మొత్తం 59 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జనవరి 22న విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ ఎస్ ఏ అబోడ్ - జస్టిస్ బీఆర్ గవాయ్ - సూర్యకాంత్‌ లతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ స్పష్టం చేసింది.

అలాగే సుప్రీం కోర్టు.. నూతన చట్టంలోని నిబంధనలపై బోలెడంత గందరగోళం నెలకొందన్న పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ అభిప్రాయాన్ని అంగీకరించింది. ఆడియో విజువల్ ద్వారా పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను విస్తృతంగా సర్క్యులేట్ చేశారా అని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను సుప్రీం ప్రశ్నించగా .. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఒకేసారి వాదనలు వినిపించడం ప్రారంభించగా.. ఏజీ జోక్యం చేసుకున్నారు. కోర్టులో ఒకే సమయంలో కేవలం ఒకే లాయర్ వాదనలు వినిపించాలన్నారు.