Begin typing your search above and press return to search.

టెక్నాలజీకే అందని 'అసని' తుఫాన్.. ఐదుసార్లు దిశ మార్పు

By:  Tupaki Desk   |   11 May 2022 7:28 AM GMT
టెక్నాలజీకే అందని అసని తుఫాన్.. ఐదుసార్లు దిశ మార్పు
X
'అసని' తుఫాన్ ఏపీని భయపెడుతోంది. ఏపీ, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తుఫాన్ కారణంగా ఇరు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో కల్లోలం రేగుతోంది. తుఫాన్ వరుసగా దిశను మార్చుకుంటున్న తీరు వాతావరణ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఐదు సార్లు దిశ మార్చుకున్న ఈ తుఫాన్ బలహీనపడకుండా తీరం వైపు దూసుకొస్తోంది. తీరం దాటుతుందా? లేదా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తుఫాన్ రేపటికల్లా వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ విభాగాలు చెబుతున్నాయి.

గతంలో ఏపీ తీరంలో ఏర్పడిన తుఫాన్ ల కదలికలు చాలా స్పష్టంగా ఉండేవి. తుఫాన్ గా రూపాంతరం చెందడం నుంచి మొదలుకొని ఎప్పుడు ఏ దిశగా పయనిస్తోందన్నది తెలిసేది. ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంటుందన్న దానిపై స్పష్టమైన మ్యాప్ లు ఉండేవి. వాతావరణ నిపుణులు కూడా ఆ మేరకు అంచనావేసేవారు. కానీ ఈసారి అసని తుఫాన్ మాత్రం కొంత అస్పష్టంగా పయనిస్తోంది. దీంతో ఖచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో లేక బలహీనపడుతుందో చెప్పడం తెలియక వాతావరణ నిపుణులే గందరగోళంలో పడుతున్నారు.

సహజంగా వేసవిలో వచ్చే తుఫాన్లు తీరం దాటడానికి ముందే దిశను మార్చుకుంటాయి. అసని తుఫాన్ కు పేరు పెట్టకముందే ఈ విషయాన్ని వాతావరణ శఆఖ అంచనావేసింది. అందుకే దాని గతిని అంచనావేయడంలో మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలు సక్సెస్ కాలేకపోయారు.

ముందుగా ఒడిశాకు తీవ్ర ముప్పు అన్నారు. ఉత్తరాంధ్రకు భారీ వర్షం అన్నారు. నిన్న బాపట్ల జిల్లాకు చేరువ అన్నారు. ఇప్పుడు మచిలీపట్నం బాపట్ల మధ్య తీరం దాటవచ్చంటున్నారు. కాకినాడ వైపు మరలుతోందని ఇప్పుడు తాజాగా చెబుతున్నారు.

రేపు ఉదయం కల్లా తుఫాన్ వాయుగుండంగా మరింత బలహీన పడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీల వేగంతో తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని చెబుతున్నారు. ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నానికి 60 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లోనే వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రయాణిస్తుందని అంటున్నారు.

దీని ప్రభావంతో ఇప్పుడు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, గోదావరి, ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. ప్రస్తుతం భారీ వర్షాలు ఇంత ఎండల్లోనూ ఉత్తరాంధ్రను వణికిస్తున్నాయి.

అసని దిశ విషయంలో ఇప్పటివరకూ అధికారుల అంచనాలు గాడితప్పాయి. అసని ఇప్పటికే ఐదు సార్లు దిశను మార్చి దూసుకొస్తోంది. ఏపీలో ఏ తీరానికి ముప్పు అన్నది సరిగ్గా అంచనావేయలేక అధికారులు సతమతమవుతున్నారు.

ప్రస్తుతం అసని తుఫాన్ పయనిస్తున్న దిశ, వేగం బట్టి చూస్తే అది మచిలీపట్నం నుంచి భీమవరం జిల్లాలోని నరసాపురం లేదా కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ విభాగం అంచనావేస్తోంది. ఈ రెండు తీరాల్లో రేపటి కల్లా ఏదో ఒక చోట తీరం దాటవచ్చని అంటున్నారు. మరి ఎంత నష్టాన్ని మిగిలిస్తుందన్నది వేచిచూడాలి.