Begin typing your search above and press return to search.

మళ్లీ అణ్వస్త్రాల తయారీ.. కిమ్ హెచ్చరిక

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:43 PM IST
మళ్లీ అణ్వస్త్రాల తయారీ.. కిమ్ హెచ్చరిక
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు మరోసారి జూలు విదిల్చాడు. శాంతి చర్చలకు సమ్మతించి అమెరికా అధ్యక్షుడితో వరుస భేటిలు జరిపిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తాజాగా కలకలం సృష్టించే మాటలు మాట్లాడారు. తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుండా మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తామని అమెరికాను కిమ్ హెచ్చరించారు.

అమెరికాతో శాంతి చర్చలు ఫలించినా కూడా తమపై ఇంకా ఆంక్షలు ఎత్తివేయలేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆక్షేపించారు. ఈ మేరకు ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ద్వారా అధికారిక వార్త సంస్థ కేఎన్సీఏ తెలిపింది.

నరరూప రాక్షసుడిగా పాలించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఈ ఏడాది ఏప్రిల్ లో మారిపోయాడు. తాము అణ్వస్త్ర క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నామని.. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి పెడుతున్నామని ప్రకటించారు. అందులో భాగంగానే సింగపూర్ లో అమెరికా అధ్యక్షుడితో సమావేశమై కొరియాలో శాంతిస్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే పూర్తిగా అణ్వస్త్రాలను వదిలేస్తేనే ఆంక్షలు ఎత్తివేస్తామని అమెరికా మెలిక పెట్టడంతో చర్చలు ఆగిపోయాయి. తాజాగా కిమ్ ఆంక్షలు ఎత్తివేయకుంటే అణు కార్యక్రమాలను మళ్లీ మొదలుపెడుతామని అమెరికాను హెచ్చరించడం విశేషం.