Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఆఫ్గాన్ అభిమానుల వంతు.. ర‌చ్చ రచ్చ‌!

By:  Tupaki Desk   |   8 Sep 2022 11:36 AM GMT
ఇప్పుడు ఆఫ్గాన్ అభిమానుల వంతు.. ర‌చ్చ రచ్చ‌!
X
సాధార‌ణంగా ఫుట్‌బాల్‌, క్రికెట్ మ్యాచుల్లో త‌మ దేశ జ‌ట్లు ఓట‌మి పాల‌యితే అభిమానులు త‌ట్టుకోలేరు. క్రీడా మైదానాల్లో ర‌చ్చ‌రచ్చ చేస్తారు. శ‌త్రు దేశాల క్రీడాకారుల‌పైకి వాట‌ర్ బాటిళ్లు, గాజు సీసాలు విసురుతారు.. రాళ్లు కూడా విసురుతారు. సాధార‌ణంగా ఇవి పెద్ద దేశాల అభిమానులు మాత్ర‌మే చేస్తుంటారు. ఆయా ఆట‌ల్లో చిన్న‌దేశాల అభిమానులు ఇలా చేయ‌డం క‌ద్దు. అయితే అప్గానిస్థాన్ అభిమానులు ఇలాగే ర‌చ్చ రచ్చ చేశారు. త‌మ దేశం ఆసియా క‌ప్ టీ20 సూప‌ర్ 4 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్ పై ఓట‌మి పాల‌యింది. చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ గెలిచి ఫైన‌ల్ కు దూసుకుపోయింది. అప్గానిస్థాన్.. ఇండియా మాదిరిగానే ఇంటి ముఖం ప‌ట్టింది.

అయితే.. ఈ మ్యాచ్‌ అనంతరం స్టేడియంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ అభిమానుల మధ్య గొడ‌వ జరిగింది. అంతేకాకుండా ఇరు దేశాల ఆట‌గాళ్లు కూడా మ్యాచ్ మ‌ధ్య‌లో తగాదా ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వీడియో వైర‌ల్ గా మారింది.

పాక్ చేతిలో త‌మ జ‌ట్టు ఓటమిని తట్టుకోలేని పలువురు అఫ్గాన్‌ అభిమానులు మ్యాచ్ అనంత‌రం స్టేడియంలోని కుర్చీలను విరగొట్టారు. ఈ కుర్చీల‌ను పాక్‌ అభిమానులపైకి విసిరేసినట్లు పలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించిన ఓ వీడియోను పాక్‌ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌లో షేర్‌ చేసి అఫ్గాన్ అభిమానుల‌పై ధ్వ‌జ‌మెత్తారు.

'అఫ్గాన్‌ అభిమానులు ఎలా ప్ర‌వ‌ర్తించారో చూడండి. వారు గతంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఆట‌ను క్రీడా స్ఫూర్తితో ఆడాలి. గెలుపోటములను అంతే స్ఫూర్తితో తీసుకోవాలి. ఆటలో ఎదగాలనుకుంటే ఆటగాళ్లు, అభిమానులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి' అంటూ అఫ్గాన్‌ టీమ్‌పై షోయ‌బ్ అక్తర్ మండిప‌డ్డాడు. అక్తర్ తన పోస్ట్‌లో అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో షఫీక్ స్టానిక్ జాయ్‌ను ఈ ట్వీటుకు ట్యాగ్‌ చేశాడు.

దీనిపై షఫీక్ జాయ్ కూడా అంతే దీటుగా బదులిచ్చాడు. 'అభిమానుల భావోద్వేగాలను నియంత్రించలేం. క్రికెట్‌ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. కబీర్‌ ఖాన్‌, ఇంజిమామ్‌, రషీద్ లతీఫ్‌లను మీరు అడగండి.. మేం వారితో ఎలా ప్రవర్తించామో' అని ఘాటుగా బదులిచ్చాడు.

ఆప్గాన్‌పై పాక్ గెలుపుతో ఇండియా, ఆప్గాన్ రెండూ ఆసియా క‌ప్ లో ఇంటి ముఖం ప‌ట్టాయి. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య నామ‌మాత్ర‌మైన మ్యాచ్ సెప్టెంబ‌ర్ 8, గురువారం జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఊర‌ట పొందాల‌ని రెండ్లు జ‌ట్లూ చూస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.