Begin typing your search above and press return to search.

జగన్ కు అక్టోపస్ భద్రత.. ఏం మారుతుంది?

By:  Tupaki Desk   |   19 Dec 2019 4:31 AM
జగన్ కు అక్టోపస్ భద్రత.. ఏం మారుతుంది?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ రక్షణ ఉంది. వీరితో పాటు ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్ కూడా భద్రతా ఏర్పాట్లను చూస్తుంటుంది. తాజాగా వీరితో పాటు.. అక్టోపస్ కమాండోలతో కూడిన టీం కూడా జగన్ భద్రతను చూడనుంది. ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళమైన అక్టోపస్ ను జగన్ భద్రతలో భాగం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో పాటు ఇటీవల సీఎంతో పాటు పలువురు వీఐపీల భద్రతకు సంబంధించిన నిర్ణయాలను హోం సెక్రటరీ.. డీజీపీ.. లా అండ్ ఆర్డర్ ఐటీ.. ఇంటెలిజెన్స్ చీఫ్ తో కూడిన సెక్యురిటీ రివ్యూ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఐదు బృందాలు సీఎం జగన్ భద్రతను చూసుకుంటాయి. ఈ టీంలో మొత్తం 32 మంది సభ్యులు ఉంటారు.

ముఖ్యమంత్రి వెళ్లిన ప్రతి కార్యక్రమంలోనూ వీరు ఉంటారు. అక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేన్స్ గా వ్యవహరిస్తారు. ఉగ్రవాద చర్యల్ని ఎదుర్కొనేందుకు ఏపీకి చెందిన ప్రత్యేక దళంగా దీన్ని చెప్పాలి. ఇప్పటివరకూ ఎస్పీఎఫ్ పోలీసులతో పాటు గన్ మెన్లు సీఎం జగన్ కు రక్షణ కల్పించే వారు. వీరితో పాటు జడ్ ప్లస్ భద్రత ఉండేది. వీటన్నింటితో పాటు అక్టోపస్ భద్రతను జగన్ కు కల్పించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.