Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యధిక వయస్కుడు ఓటేసేందుకు రెడీ

By:  Tupaki Desk   |   2 Nov 2022 1:30 AM GMT
దేశంలోనే అత్యధిక వయస్కుడు ఓటేసేందుకు రెడీ
X
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 106 ఏళ్ల వయసు. దేశంలోనే అత్యధిక వయసున్న ఓటరుగా దేశవ్యాప్తంగా గుర్తింపు. భారత ప్రజాస్వామ్య 'లివింగ్ లెజెండ్'గా పేరుపొందిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 106 ఏళ్ల శ్యాంశరణ్ నేగీ మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినా కూడా నిరాకరిస్తూ నడిచి వెళ్లి సొంతంగా ఓటేసేందుకు రెడీ అయ్యారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా ఎన్నికల సంఘం అధికారులు 12డి ఫారాన్ని తీసుకొని నేగీ ఇంటికి వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన మాత్రం ఆ ఫారాన్ని తీసుకోకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తానంటూ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు తెలిపారు.

నవంబర్ 12వ తేదీన నేగీని ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి తీసుకొస్తామని.. అక్కడ ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతామని అధికారులు వెల్లడించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో శ్యాం ఓటేశారు. అప్పటి నుంచి లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు కలిపి మొత్తం 32 సార్లు ఓటేసి యువతానికి ఆదర్శంగా నిలిచారు.

ప్రస్తుత కాలంలో కాళ్లు చేతులు ఉన్న యువత కూడా స్మార్ట్ పోన్లు అంటూ.. జాబ్ లు అంటూ ఓటును నిర్లక్ష్యం చేస్తున్న ఈరోజుల్లో ఈ పండు ముదుసలి వ్యక్తి ఇలా ఓటేసేందుకు రావడం అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఈయన మార్గంలో అందరూ పయనించాలని కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.