Begin typing your search above and press return to search.

సరిగ్గా ఇదే రోజు : అఖండ భారత్ రెండు ముక్కలైంది

By:  Tupaki Desk   |   18 July 2022 3:30 PM GMT
సరిగ్గా ఇదే రోజు : అఖండ భారత్ రెండు ముక్కలైంది
X
అఖండ భారతం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళి రెండు వందల ఏళ్ళ పాటు మగ్గిన తరువాత ఎందరో పోరాటాలు అమర వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించింది. అయితే తెల్లదొరల చేతులలోకి వెళ్లిన దేశం తిరిగి అలాగే వచ్చిందా అంటే కానే కాదు, రెండు ముక్కలుగా మారి రెండు దేశాలుగా అవతరించి అసలైన స్వరూపాన్ని కోల్పోయి వచ్చింది.

దేశానికి స్వాతంత్రం రాక ముందు భారత్ ని బ్రిటిష్ ఇండియాగా పిలిచేవారు. బ్రిటిష్ వారి ఏలుబడి సాగుతున్న వేళ ఒక వైపు ఉద్యమాలు మరో వైపు అనేక రకాలైన చర్చలు కూడా సాగాయి. చివరికి అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాల క్రమంలో భారత్ ని వీడిపోవాల్సిన అగత్యం అవసరం బ్రిటిష్ వారికి ఏర్పడింది.

ఆ సమయంలో కూడా భారత్ ఒకే దేశాన్ని ప్రకటించ‌కుండా తెల్లదొరలు కుటిల వ్యూహాలు పన్నారు. దానికి చిక్కిన వారు చివరికి దేశాన్ని రెండుగా విడగొట్టారు. అలా 1947 జూలై 18న బ్రిటిష్ ఇండియా రెండుగా విడిపోయింది. అది అధికారికంగా చట్టం చేసి దాన్ని బ్రిటిష్ పార్లమెంట్ లో ఆమోదించారు. భారత్ పాకిస్థాన్ అనే రెండు దేశాలుగా అఖండ భారతాన్ని గుర్తిస్తూ విభజిస్తూ చట్టాన్ని రూపకల్పన చేశారు.

దానికి ముందు ఈ విభజన  చట్టాన్ని చేసే పనిలో భారతీయ నాయకులకు కూడా అవకాశం కల్పించారు. అలా చట్టం చేసేందుకు భారత దేశం తరఫున పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించగా, పాకిస్థాన్ తరఫున ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ ఆలీ జిన్నా సహా ఆ వైపు నాయకులు పనిచేశారు. ఇక్కడ కీలకమైన నాయకుడు, జాతి పిత మహాత్మా గాంధీ మాత్రం కనిపించలేదు. ఎందుకంటే ఆయనకు దేశం రెండుగా విడిపోవడం ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ విభజన చట్టం రూపకల్పనలో అసలు జోక్యం చేసుకోలేదు. బ్రిటిష్ వారు కూడా ఆయన్ని పిలవలేదు

ఆ విధంగా విభజన చట్టం తయారు చేసిన మీదట 1947 ఆగస్ట్ 14న పాకిస్థాన్ కి ఆగస్ట్ 15న భారత్ కి స్వాతంత్రాన్ని ఇస్తూ బ్రిటిష్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అఖండ భారతం రెండు ముక్కలుగా చేసిన చట్టం ఆమోదించిన జూలై 18ని చాలా మంది చీకటి రోజుగా భావిస్తారు.

ఇక ఇంకా చెప్పాలీ అంటే బ్రిటిష్ వారి పాలన సాగుతూండంగా అఖండ భారతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా 1870 ప్రాంతంలో వేరు చేసి ఒక్క ముక్క నాడే చేశారు. దానికి ముందూ వెనకలుగా శ్రీలంక, నేపాల్ తదితర చుట్టుపక్కన ఉన్న  అయిదారు దేశాలు కూడా భారత్ నుంచి విడిపోయినవే. మొత్తానికి ఇపుడున్న భారత్ స్వాతంత్రానికి ముందు మాత్రం కాదు అని చరిత్రకారులు నొక్కి చెప్పే మాట.