Begin typing your search above and press return to search.

ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది..కరకట్టపై ఉద్రిక్తత - టీడీపీ నేతలు అరెస్ట్!

By:  Tupaki Desk   |   25 Jun 2020 8:50 AM GMT
ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది..కరకట్టపై ఉద్రిక్తత - టీడీపీ నేతలు అరెస్ట్!
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసి సరిగ్గా నేటికీ ఏడాది పూర్తి అయ్యింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశాన్ని ప్రజావేదికలోనే నిర్వహించారు. ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో అమలు విజన్ గురించి ప్రకటించిన తర్వాత… మనం అక్రమ కట్టడంలో కూర్చున్నామని సంచలన ప్రకటన చేశారు. ప్రజావేదికను కూలగొట్టాలని ఆదేశించారు. దీనితో వెంటనే దాన్ని కూల్చేశారు.

కాగా, ఆ ప్రజా వేదికను కూల్చేసి నేటికీ సరిగ్గా ఏడాది అవ్వడంతో ఈ సందర్భంగా ప్రజావేదిక శిథిలాలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలనూ అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు.

చంద్రబాబు నివాసానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ నేతలు మండి పడ్డారు. మహమ్మారి నిబంధలు తమకు తెలుసని.. తమ అధినేత ఇంటికి వెళ్లనివ్వరా అంటూ మండిపడ్డారు. కరకట్ట దగ్గర టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, తెనాలి శ్రవణ్‌కుమార్‌లను పోలీసులు వ్యాన్ ఎక్కించి వెనుకకి తరలించారు. అయినా టీడీపీ నేతలు వెనక్కు తగ్గక పోవడంతో కొల్లు రవీంద్ర, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రజా వేదిక కూలగొట్టిన శిథిలాలను కూడా ఇంత వరకూ ప్రభుత్వం తొలగించ లేక పోయింది..కూల గొట్టి అలా వదిలేసింది. ప్రభుత్వ విధ్వంస పాలనకు సాక్ష్యంగా అక్కడ అవి కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని ఎట్టి చూపుతూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనకు సాక్ష్యంగా నేటికీ ప్రజా వేదిక శిధిలాలను అదే విధంగా ఉంచారు. అన్ని వ్యవస్థల్ని కుప్ప కూల్చారు. రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు అరెస్టులు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షమంటే ఎందుకు భయం చెప్పండి సీఎం జగన్ గారు?’’ అని ప్రశ్నిస్తూ దేవినేని ట్వీట్ చేశారు.