Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కిలో ఉల్లి రూ.80

By:  Tupaki Desk   |   18 Aug 2015 4:25 AM GMT
ఢిల్లీలో కిలో ఉల్లి రూ.80
X
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ.. అదే ఉల్లి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వాలే పడిపోయిన ఉదంతం భారత రాజకీయాల్లో కొత్తేం కాదు. ఉల్లి ధర ఇప్పుడు వినియోగదారుల కంటికి కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితి. ధరల అదుపునకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అలాంటిదేమీ కనిపించని పరిస్థితి.

దూసుకెళుతున్న ఉల్లి ధరల విషయంలో తాజాగా మరో రికార్డు నమోదైంది. కిలో ఉల్లి రూ.80 టచ్ చేసింది. ఢిల్లీలో సోమవారం కిలో ఉల్లి రూ.80 విక్రయించారు. హోల్ సేల్ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.48గా ఉండటం గమనార్హం.

ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర.. గుజరాత్.. మధ్యప్రదేశ్.. కర్ణాటక నుంచి పంట వచ్చేందుకు మరింత సమయం తీసుకుంటుందన్న అంచనాలతో.. మార్కెట్ లో తగినంత సరుకు ఉన్నప్పటికీ.. ధర మాత్రం పెరిగింది. ఉల్లి ధర విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అలాంటివేమీ అమలు కావటం లేదు.

ఉల్లి ధర విషయంలో పట్టనట్లుగా వ్యవహరించిన పాలకులకు ప్రజలు తర్వాతి ఎన్నికల్లో షాక్ ఇవ్వటం కొత్తేం కాదు. మరి.. పెరిగిపోతున్న ఉల్లి ధరను కంట్రోల్ చేయటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోని పక్షంలో మరిన్ని కష్టాలు తప్పవని చెబుతున్నారు. మరి.. మోడీ సర్కారు ఉల్లి ధరల మీద దృష్టి పెడితే మంచిదంటున్నారు.