Begin typing your search above and press return to search.

జగన్ కోసం పాదయాత్ర చేసి.. తాజాగా కేసులతో ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   12 Nov 2022 5:12 AM GMT
జగన్ కోసం పాదయాత్ర చేసి.. తాజాగా కేసులతో ఉక్కిరిబిక్కిరి
X
వైసీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అతగాడికి మహా అభిమానం. అందుకు నిదర్శనంగా అతడికి ఉన్న అభిమానానికి నిదర్శనంగా.. జగన్ సీఎం కావాలంటే యాత్రనే చేశాడు. అలాంటి అభిమాని.. సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన తప్పుల్ని ఎత్తి చూపిన కారణంగా ఎదుర్కొంటున్న కష్టాలు.. చివరకు పిల్లను ఇచ్చిన మామను కోల్పోవాల్సిన వైనానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన సిద్ధార్థ గౌడ్ ఆవేదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

వైసీపీ నేత సిద్దార్థగౌడ్ ఏపీ రాస్ట్ర డ్రైవర్ల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు సీఎం జగన్ అంటే విపరీతమైన అభిమానం. జగన్ ముఖ్యమంత్రి కావాలని.. వైసీపీ అధికారంలోకి కావాలని కోరుకుంటూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డ్రైవర్లతో కలిసి భరోసాయాత్ర నిర్వహించిన గతం అతని సొంతం. అలాంటి సిద్దార్థ గౌడ్ ఆ మధ్యన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తీరును తప్పు పడుతూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

దాని సారాంశం ఏమంటే.. ఒక జాతీయ నేత విగ్రహాన్ని సుండుపల్లి మండలంలోని ఒక మురుగు కాల్వలో పడేసిన వైనాన్ని ఎత్తి చూపుతూ.. పోస్టు పెట్టారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. దీంతో.. వ్యవస్థలు తమ పని తాము చేయటం మొదలయ్యాయి. తనపై ఎమ్మెల్యే కక్ష పెంచుకోవటమే కాదు.. తనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించారని ఆరోపించారు.

'సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు నందలూరు.. రాయచోటి.. సుండుపల్లె.. రాజంపేట పోలీస్ స్టేషన్ లలోకేసులు నమోదయ్యాయి. ఎమ్మల్యే ఒత్తిడితోనే కేసులు పెట్టారు. హైదరాబాద్ లో తలదాచుకున్నా. అయినా విడిచి పెట్టకుండా పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరులు హైదరాబాద్ కు వచ్చి దౌర్జన్యం చేశారు. భార్యను.. పిల్లల్ని అత్తగారి ఊరైన వికారాబాద్ జిల్లాలోని పరిగికి తీసుకెళ్లా. అక్కడికి వచ్చిన పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరుల తీరుతో మా మామగారు తీవ్రమైన మనస్తాపంతో గుండెపోటుతో మరణించారు.

పోలీసులు వచ్చి మా డ్రైవర్ ను కొట్టి.. రూ.లక్ష క్యాష్.. ఫోన్ తీసుకెళ్లారు. నియోజకవర్గంలో వందల ఎకరాలను ఎమ్మెల్యే కబ్జా చేశారు. బినామీల పేరుతో 200 ఎకరాలు.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడు మేడా విజయభాస్కర్ రెడ్డి పేరుతో 800 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. ఇంకా చిట్టా ఉంది. త్వరలో విప్పుతా' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వార్తలు ప్రధాన మీడియాలోనూ రావటంపై కలకలం రేగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.