Begin typing your search above and press return to search.

152/0 వర్సెస్ 168/0.. టీమిండియా ఓటమిపై ట్వీట్ లో పాక్ ప్రధాని అక్కసు

By:  Tupaki Desk   |   11 Nov 2022 11:43 AM GMT
152/0 వర్సెస్ 168/0.. టీమిండియా ఓటమిపై ట్వీట్ లో పాక్ ప్రధాని అక్కసు
X
టీమిండియా టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓడాక అభిమానులు ఓవైపు బాధలో మునిగిపోగా.. పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ వారి పుండు మీద కారం చల్లినట్లయింది. అసలే ఫేవరెట్ హోదాలో బరిలో దిగి ఫైనల్స్ కు చేరలేకపోయామని టీమిండియా అభిమానులు నిర్వేదం చెందుతుంటే.. పాక్ ప్రధాని మాత్రం వెటకారంగా ట్వీట్ చేసి రెచ్చగొట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు దీటుగానే ప్రతిస్ఫందించారు.

ముందు మీ జట్టెలా ఉందో చూసుకో?

ఈ ప్రపంచ కప్ లో లక్ కలిసొచ్చిన జట్టు ఏదంటే పాకిస్థానే. తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో.. మరుసటి మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఓడిపోయి.. టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోయే దుస్థితిని ఎదుర్కొంది ఆ జట్టు. అయితే, దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడడంతో పాక్ కు మేలు చేసింది. అనంతరం సెమీ ఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్ కావడం మరింత మేలు చేసింది.

న్యూజిలాండ్ మంచి జట్టే అయినా.. వారి స్థాయి కప్ కొట్టేంత ఉండదు. సెమీస్ లేదా ఫైనల్స్ కు రావడం.. ఓడడం వారికి రివాజు. పెద్ద మ్యాచ్ లంటే కివీస్ ఆటగాళ్లు తేలిపోతుంటారు. దీంతోనే మొదటి సెమీ ఫైనల్లో పాకిస్థాన్ పని సులువైంది. ఫైనల్ కు చేరింది. అయితే, దీనినే గొప్ప అనుకుంటే పొరపాటే. ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి కప్ గెలిస్తేనే పాకిస్థాన్ మేటి జట్టని ఎవరైనా ఒప్పుకొంటారు.

ఏమిటా ట్వీట్ అంతరార్థం...?

నిరుడు టి20 ప్రపంచ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో చక్కటి విజయాన్ని సాధించింది. అయితే, తర్వాతి నాకౌట్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఆ మ్యాచ్ లో భారత్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజామ్, మొహమ్మద్ రిజ్వాన్ వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించారు. ప్రపంచ కప్ లలో పాకిస్థాన్ చేతిలో మనకు ఇదే తొలి ఓటమి. దీంతోనే ఆ గెలుపునకు పాక్ కు అంత ప్రాధాన్యం ఇచ్చింది.

మరోవైపు గురువారం మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ 168 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించి భారత్ ను ఇంటికి పంపిది. దీన్ని ఉద్దేశిస్తూనే పాక్ ప్రధాని షాబాజ్ ఎత్తిపొడుపు ట్వీట్ చేశాడు. అయితే, క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆయన మర్చిపోయినట్లున్నారు.

ఇదే పాకిస్థాన్ జట్టు టి20 ప్రపంచ కప్ తొల మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడింది. ఆ తర్వాత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంది. కానీ, అప్పుడు భారత్ తరఫున ఎవరూ ఇలాంటి ట్వీట్లు చేయలేదు. కానీ, పాక్ ప్రధాని మాత్రం తన స్థాయికి తగని ట్వీట్ తో చర్చనీయాంశం అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.