Begin typing your search above and press return to search.

నాటకీయ పరిణామాల మధ్య అభినందన్

By:  Tupaki Desk   |   2 March 2019 5:28 AM GMT
నాటకీయ పరిణామాల మధ్య అభినందన్
X
అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా భారత్ కు తిరిగివచ్చాడు. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని వెంటాడి వేటాడి కూల్చేసిన అభినందన్ తన విమానంతో సహా పాకిస్తాన్ లో పడిపోయాడు. పాక్ ఆర్మీకి బంధీగా చిక్కుకుపోయారు. అప్పటి నుంచి భారత దేశ ప్రజలంతా అభినందన్ వస్తాడా రాడా అన్నా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. భారత్ కూడా దౌత్యపరంగా పాక్ పై ఒత్తిడి తేవడంతో పాక్ ప్రధాని అభినందన్ ను భారత్ కు అప్పగించేందుకు రెడీ అయ్యింది.

*అభినందన్ ఎప్పుడొచ్చాడు.?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత ప్రజలను పాకిస్తాన్ టెన్షన్ పెట్టింది. సాయంత్రం 4.30గంటలకు విడుదల చేస్తామని చెప్పి రాత్రి 9 గంటల తర్వాత సాంకేతిక కారణాలంటూ జాప్యం చేసింది. చివరకు 9.21 గంటలకు పాక్ అధికారులు అభినందన్ ను భారత బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు.

*ఆలస్యానికి కారణమిదే..

చిట్టచివరకు శుక్రవారం రాత్రి అట్టారీ-వాఘా సరిహద్దులో భారత అధికారులకు అభినందన్ ను పాకిస్తాన్ ఆర్మీ అప్పగించింది. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. డాక్యుమెంటేషన్, విధానపరమైన ప్రక్రియ కారణంగా అభినందన్ అప్పగింతకు కొన్ని గంటల పాటు ఆలస్యమైనట్టు సమాచారం.

*అభినందన్ ఏమన్నాడు.?

వర్ధమాన్ విడుదలయ్యాక.. తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అభినందన్ అధికారులకు చెప్పారు. అభినందన్ ను ప్రత్యేక విమానంలో అమృతసర్ నుంచి వైద్యపరీక్షల కోసం ఢిల్లీకి తరలించారు.

*అభినందన్ ను ఈరోజు ఏం చేస్తారు?

అభినందన్ ను నిన్న రాత్రి 9.30 గంటలకు పాక్ ఆర్మీ భారత్ కు అప్పగించింది. అక్కడి నుంచి అమృత్ సర్ కు తరలించి రాత్రి 12 గంటలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈరోజు నిఘా, ఆర్మీ, రా, ఐబీ సహా భారత ఉన్నతాధికారు పర్యవేక్షణలో శనివారం అభినందన్ మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితిని పరీశీలిస్తారు. అభినందన్ ను ఎలా విచారించారు.. శరీరంలో ఏమైనా చిప్స్ అమర్చారా.. డ్రగ్స్ ఇచ్చి వీడియోల్లో చెప్పించారా.? ఏమేం అభినందన్ చెప్పాడన్నది భారత అధికారులు విచారిస్తారు..

*అభినందన్ విడుదల కాగానే సంబరాలు

అభినందన్ వాఘా నుంచి భారత్ లోకి రాగానే అక్కడ ఉన్న జనం భారత్ మాతాకీజై, అభినందన్ ను కీర్తిస్తూ నినాదాలతో మారుమోగించారు. అభినందన్ కు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం నుంచి గుమిగూడిన ప్రజలు కోలాహలం సృష్టించారు. దేశభక్తిని చాటారు. తన ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడిని నేరుగా చూడబోతుండడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. అమృత్ సర్ డిప్యూటీ మేయర్ రమణ్ బక్షి ప్రజలతో కలిసి వాఘా వద్ద పాటలు పాడారు. డోలు వాయిస్తూ, గజమాలతో అభినందన్ అంటూప్రజలు హోరెత్తించారు. వాఘా వద్ద పటిష్ట భద్రతను పోలీసులు కల్పించారు.

*మీడియా, ప్రజల ఫోకస్ అంతా అభినందనే..

అభినందన్ విడుదల సందర్భంగా దేశమంతా, మీడియా అంతా నిన్న ఆయన ప్రసారాలతో నింపేసింది. దేశభక్తితో ప్రజలంతా కనెక్ట్ అయిపోయారు. మోడీ, ఇతర రాజకీయ నేతల వార్తలను కూడా జనాలు, మీడియా పట్టించుకోలేదు. అభినందన్ కోసం ఎడతెగని చర్చలు, నిపుణుల వ్యాఖ్యానాలు, అభినందన్ విడుదలపై సమాచారం కోసం రోజంతా హడావుడిగా గడిచిపోయింది. అహ్మదాబాద్ లో యువతుల గార్బా నృత్యాలు, బెంగళూరులో జోష్ నృత్యాలు, పూరిలో సైకత శిల్పం, పలు ప్రాంతాల్లో యజ్ఞాలు నిర్వహించారు. నిన్న అంతా జనాలు ఓ కన్ను టవీపై, మరో కన్ను మొబైల్ పై అభినందన్ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూశారు.

*ప్రముఖుల హర్షం.

అభినందర్ భారత్ కు తిరిగి రావడంతో ప్రముఖులు ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ ధైర్యసాహసాలకు పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అభినందన్ విడుదల కాగానే ప్రధాని రాహుల్, సహా అమిత్ షా, వైసీపీ అధినేత జగన్ లు ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోస్థైర్యం ఇవ్వాలని.. శక్తి ధైర్యాన్ని ఇవ్వాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు కూడా అభినందన్ రాకపై హర్షం వ్యక్తం చేశారు..