Begin typing your search above and press return to search.

చెప్పులు..చీపుర్లు..ప‌రిటాల సునిత కాన్వాయ్‌ పై మ‌హిళ‌ల ఆగ్రహం

By:  Tupaki Desk   |   4 Feb 2019 6:57 AM GMT
చెప్పులు..చీపుర్లు..ప‌రిటాల సునిత కాన్వాయ్‌ పై మ‌హిళ‌ల ఆగ్రహం
X
అనంతపురం జిల్లా తోపుదుర్తిలో స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రన్న పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఆమెకు సొంత నియోజకవర్గంలోనే ఊహించ‌ని నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆ గ్రామ డ్వాక్రా మహిళలు అడ్డుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు - సునీత అధికారం చేపట్టాక పొదుపు మహిళలకు అన్యాయం చేశారని - దీంతో తాము అప్పులపాలయ్యామని ధ్వజమెత్తారు. ఇప్పుడు చెక్కుల పంపిణీ పేరుతో మరోమారు మోసం చేయడానికి వస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. వాహ‌నంపై చెప్పులు చీపుర్లు విసిరి త‌మ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

తోపుదుర్తిలో పసుపు కుంకుమ పంపిణీని అడ్డుకునేందుకు మహిళలు తీవ్రయత్నం చేశారు. ఈక్రమంలో మంత్రి కాన్వాయ్‌ పై మహిళలు చెప్పులు - చీపుర్లు విసిరారు. దీంతో పోలీసులు - మహిళల నడుమ తోపులాట - వాగ్వాదం చోటుచేసుకుని గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి మహిళా సిబ్బంది సాయంతో ఆందోళనకారులను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అలాగే మంత్రి పరిటాల సునీతను మార్గమధ్యంలోని సనప గ్రామం వద్ద పోలీసులు నిలువరించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జీవీజీ.అశోక్‌ కుమార్ అక్కడికి చేరుకుని మంత్రికి పరిస్థితిని వివరించారు. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకున్న అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య మంత్రి పరిటాల సునీత పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాగా రాత్రి వరకూ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ తమ పట్ల పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, తోపుదుర్తిలో మ‌హిళ‌ల నిరసన‌ను ముందే ప‌సిగ‌ట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తుగానే ఓఎస్‌ డీ స్వామి నేతృత్వంలో ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 8 మంది సీఐలు - సుమారు 350 మంది సివిల్ పోలీసులు - సాయుధ దళాలు గ్రామంలో మోహరించాయి. భారీ బందోబస్తు నడుమ గ్రామంలో ఉదయమే కవాతు నిర్వహించి గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే తోపుదుర్తి గ్రామానికి వెళ్లే మార్గంలో రెండు పోలీసు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా ఉంచారు. అయిన‌ప్ప‌టికీగ్రామంలో మహిళలు ఆందోళనకు దిగి సీఎం చంద్రబాబు - మంత్రి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.