Begin typing your search above and press return to search.

వామ్మో...కరోనా వేళా ఆ దేశంలో పోలింగ్!

By:  Tupaki Desk   |   15 April 2020 3:30 PM GMT
వామ్మో...కరోనా వేళా ఆ దేశంలో పోలింగ్!
X
ఓ వైపు ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్నా దక్షిణ కొరియా మాత్రం యధాతథంగా ఎన్నికల్లో కీలక దశ అయిన పోలింగ్ ను నిర్వహించేసింది. కరోనా కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ఏపీలో ఓ రేంజిలో విమర్శలు చెలరేగాయి. అధికార పార్టీ వైసీపీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని దునుమాడగా... విపక్షం టీడీపీ మాత్రం సమర్థించింది. ఈ పరిణామం నేపథ్యంలో ప్రపంచంలో కరోనా మటుమాయమయ్యేదాకా ఎన్నికలనేవే జరగవన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ వాదనలను పటాపంచలు చేస్తూ దక్షిణ కొరియా కరోనా వేళలోనూ పార్లమెంటు ఎన్నికలను నిర్వహించేసింది.

కరోనా వైరస్ వ్యాప్తికి ముందే దక్షిణ కొరియాలో ఎన్నికలకు ప్రకటన వెలువడింది. అదే సమయంలో కరోనా కలకలం రేగినా... తన ఎన్నికల షెడ్యూల్ ను ఏమాత్రం మార్చుకునేందుకు దక్షిణ కొరియా సిద్ధపడలేదు. మరి సోషల్ డిస్టెన్సింగ్ తోనే కరోనాపై విజయం సాధించవచ్చన్న వాదనల నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ ను పాటిస్తూనే ఎన్నికల్లో కీలక దశ అయిన పోలింగ్ ను నిర్వహించాలని ఆ దేశం నిర్ణయించింది. అందులో భాగంగానే బుధవారం అక్కడ పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ ను పక్కాగానే అమలు చేసినట్లు దక్షిణ కొరియా పేర్కొంది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆ దేశం విడుదల చేసింది.

దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్వహించిన పోలింగ్ లో ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు - అభ్యర్ధులు - పోలింగ్‌ సిబ్బంది మాస్క్‌ లు - శానిటైజర్లు వాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరమే ఓటర్లను పోలింగ్‌ బూత్‌ లోకి అనుమతిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రత్యేక బూత్‌ ల్లో ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులు స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ఓటింగ్‌ వేళలు ముగిసిన తర్వాతా ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. కాగా ఈ ఎన్నికల్లో అధికార మూస్‌ జే ఇన్స్‌ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించాయి. మొత్తంగా కరోనా వేళలోనూ ఎన్నికలు నిర్వహించి దక్షిణ కొరియా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.