Begin typing your search above and press return to search.

చంద్రబాబు బాలకృష్ణను మించిపోతారా?

By:  Tupaki Desk   |   6 July 2016 11:02 AM GMT
చంద్రబాబు బాలకృష్ణను మించిపోతారా?
X
ఏపీ చంద్రబాబు ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే చాలామందితో సమావేశమవుతుంటారు. నేతలు - పారిశ్రామికవేత్తలు - అధికారులు - విదేశీ సంస్థల ప్రతినిధులు ఒకరేమిటి.. ఎందరో కలుస్తుంటారు. తాజాగా సినీ రంగానికి రచయితలు కొందరు చంద్రబాబును కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా డైలాగ్ రైటర్సుగా మంచి పేరున్న పరుచూరి బ్రదర్సు - గీత రచయిత అనంత్ శ్రీరాం వచ్చి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు నివాసంలోనే వారి భేటీ జరిగింది. సుదీర్ఘంగా చర్చలు జరగడంతో చంద్రబాబే వారిని పిలిచి సమావేశమైనట్లు అర్థమవుతోంది. అయితే.. వారిని ఎందుకు పిలిచారన్న విషయంలో టీడీపీ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. కానీ... ప్రభుత్వ ప్రచారం - తన ప్రసంగాల్లో వాడివేడి పెంచేందుకు.. ప్రజలను ఆకర్షించేలా మలిచేందుకు వారి సహాయం కోరినట్లు చెబుతున్నారు.

మొదటి నుంచి పబ్లిసిటీతో ప్రజలను ఆకట్టుకోవడంపై దృష్టిపెట్టే చంద్రబాబు ఈసారి కూడా అదే సూత్రాన్ని నమ్ముకుంటున్నారు. అయితే.. విపక్షాల వ్యతిరేక ప్రచారం కూడా అంతేస్థాయిలో ఉంటుండడంతో తమ ప్రచారం మరింత బలంగా ఉండాలని భావించి సినీ ప్రముఖులతో భేటీ అయినట్లు చెబుతున్నారు. పబ్లిసిటీకి అవసరమైన పాటలు అనంత్ శ్రీరాంతో రాయించడానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్లు చెబుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల కోసం.. ప్రకటనల కోసం మంచి పంచ్ డైలాగులు - నినాదాలు రాసిచ్చే బాధ్యత పరుచూరివారిపై పెట్టారట.

కాగా చంద్రబాబు 2014 ఎన్నికల ముందు కూడా సినీ దర్శకులను పిలిచి వారితో తన ప్రచారానికి ప్రణాళికలు రచించారు. ప్రజల వద్ద తాను ఎలా స్పందించాలి.. తన హావభావాలు ఎలా ఉండాలి వంటివన్నీ వారిని అడిగి తెలుసుకుని.. ఆ మేరకు మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు కూడా మరోసారి ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు వ్యూహం రచించారని.. అందులో భాగంగానే ఈ రచయితలతో భేటీ అని సమాచారం. సో.. ఇక చంద్రబాబు నోట పరుచూరి వారి పంచ్ లు పేలుతాయన్న మాట. అంటే, ఆయన తన బావమరిది - నటసింహం బాలయ్యను మించిపోయేలా డైలాగులుకొడతారన్నమాట.