Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబును ఏకిపారేస్తున్న ప‌వ‌న్

By:  Tupaki Desk   |   30 Sep 2018 9:31 AM GMT
చంద్ర‌బాబును ఏకిపారేస్తున్న ప‌వ‌న్
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న మాట‌ల‌కు మ‌రింత ప‌దునుపెడుతున్నారు. అధికార టీడీపీ - ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా చింత‌ల‌పూడిలో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్‌.. చంద్ర‌బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాళ్లు విరిచి కూర్చోబెడ‌తానంటూ హెచ్చ‌రించారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ నిల‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత టీడీపీకి దూర‌మైనా.. సొంత పార్టీ జ‌న‌సేన ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించినా.. ఎన్న‌డూ చంద్ర‌బాబుపై ప‌వ‌న్ ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగించ‌లేదు. విమ‌ర్శ‌లు గుప్పించే స‌మ‌యాల్లోనూ దాదాపుగా ప్ర‌తిసారీ చంద్ర‌బాబు గారు - సీఎం గారు అని సంబోధిస్తూనే తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది చెప్పేవారు. ఆరోప‌ణ‌లు గుప్పించేవారు.

అయితే, ఇటీవ‌ల ప‌వ‌న్ మాట‌ల్లో వాడి పెరిగింది. దుందులూరులో ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ తో సై అంటే సై అంటూ జ‌రిగిన వాగ్యుద్ధంతో ప‌వ‌న్ త‌న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ప‌దునుపెట్టారు. చంద్ర‌బాబును - ఆయ‌న కుమారుడు లోకేష్‌ ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఏకిపారేస్తున్నారు.

చింత‌ల‌పూడి స‌భ‌లోనూ చంద్ర‌బాబుపై ప‌వ‌న్ తూటాల్లాంటి మాట‌లు ప్ర‌యోగించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయ‌కండి, దెబ్బ‌కు దెబ్బ తీస్తాం జాగ్ర‌త్త‌ - కొమ్ములు విరిచేస్తా - రౌడీలు - చిల్లర గూండాలతో రాజకీయాలు చేస్తే కాళ్లు విరిచి కింద కూర్చోబెడతా అంటూ ఘాటైన మాట‌లు ఉప‌యోగించారు. యువతని బెదిరించే కార్యక్రమాలు ఆపాల‌ని.. లేదంటే ప‌రిస్థితులు వేరేలా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. హింసాయుత రాజ‌కీయాలు చేస్తానంటే అందుకు తాను సిద్ధమేనంటూ సై అన్నారు. ప‌వ‌న్ మాట‌ల తూటాల‌కు అధికార ప‌క్షం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి!