Begin typing your search above and press return to search.

పవన్ లోని ఉద్యమనేత బయటకు వచ్చేశాడు

By:  Tupaki Desk   |   24 Jan 2017 6:01 AM GMT
పవన్ లోని ఉద్యమనేత బయటకు వచ్చేశాడు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోని ఉద్యమ నేత బయటకు వచ్చేశాడు. జల్లికట్టు బ్యాన్ ను వ్యతిరేకిస్తూ తమిళులు మెరీనాబీబ్ ను క్షేత్రంగా చేసుకొని చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలో ఆర్కే బీచ్ లో జనవరి 26న మౌన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా చేపడుతున్న ఈ దీక్షకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించిన పవన్.. అందులో భాగంగా తాజాగా పోస్టర్ నువిడుదల చేశారు. లక్ష గొంతులు ఏకమైనట్లుగా.. భారీ జన సందోహం బ్యాక్ డ్రాప్ లో నుంచి పిడికిలి బిగించిన చేయి ఒకటి బలంగా పైకి లేవటం.. ‘దేశ్ బచావో’అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మరో పోస్టర్ లో ఆవేశంతో పిడికిలి బిగించిన పవన్ ఉన్న ఫోటోతో ఉన్నది విడుదల చేశారు.

ఈ సందర్భంగా గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన కొన్ని వ్యాక్యాల్ని ట్వీట్ పోస్ట్ చేశారు. ‘‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో.. ధైర్యంలో చల్ల లేకపోతే.. అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవటానికి నిర్ణయించుకుంటె.. ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి..’’ అంటూ గుండెలు మండేలా.. భావోద్వేగం ఎగిసిపడేలా వ్యాఖ్యను ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో చట్టాలు చేసే పాలకులకు జెంటిల్ రిమైండర్ గా పెట్టిన ట్వీట్ లో తనలోని వ్యంగ్యం మొత్తాన్ని గుది గుచ్చినట్లుగా శేషేంద్ర రాసిన పంక్తుల్ని యథాతధంగా పేర్కొంటూ.. ‘‘మేము పూలగుత్తులకు వ్రేలాడే వసంత రుతువులం కాదు.. వట్టి మనుష్యులం. దేశం మాకు గాయాలిచ్చినా నీకు మేం పువ్వులిస్తున్నాం. ఓ ఆశ చంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా.. యోచించు ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు’’ అని పేర్కొన్నారు.

భవిష్యత్ తరాల కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేసిన లెక్కలేనంత మంది త్యాగధనుల త్యాగాల్ని గుర్తు చేసిన పవన్ తీరు చూస్తే.. ఆయనలోని ఉద్యమ నేత పూర్తిస్థాయిలో బయటకువచ్చేసినట్లు చెప్పాలి. మరో రెండు రోజుల్లో మౌనదీక్షకు సమయం ఉన్న నేపథ్యంలో ఆయన విడుదల చేసిన పోస్టర్ చూస్తే.. ఏపీ ప్రత్యేక హోదా తనకున్న కమిట్ మెంట్ ఎలాంటిదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/