Begin typing your search above and press return to search.

భీమ‌వ‌రం, పిఠాపురం, గాజువాక‌, తిరుప‌తి ఇంత‌కీ ప‌వ‌న్ ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   17 July 2022 2:30 AM GMT
భీమ‌వ‌రం, పిఠాపురం, గాజువాక‌, తిరుప‌తి ఇంత‌కీ ప‌వ‌న్ ఎక్క‌డ‌?
X
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ రెండు ప‌డ‌వ‌ల మీద స్వారీ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సినిమాల కంటే రాజ‌కీయాల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు.

ఓవైపు జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న ప‌వ‌న్.. మ‌రోవైపు జ‌న‌వాణి కార్య‌క్ర‌మం పేరుతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తి ఆదివారం అర్జీలు స్వీక‌రించే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఏపీలో రోడ్ల దుస్థితిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి తెచ్చేందుకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ కొత్త కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నే దానిపై అనేక ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి పోటీ చేశారు. అయితే ఈ రెండు చోట్ల ప‌వ‌న్ ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం, తిరుప‌తి జిల్లాలోని తిరుప‌తి నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో తిరుప‌తి నుంచి పోటీ చేస్తార‌ని బాగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈసారి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం నుంచే పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. అలాగే ఈసారి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌ర‌ని.. భీమ‌వ‌రం ఒక్క చోటే పోటీ చేస్తార‌ని అంటున్నారు. జ‌న‌సేన పార్టీకి ఉభ‌య గోదావ‌రి జిల్లాలే కీల‌కం కాబ‌ట్టి తాను పోటీ ఇక్క‌డ నుంచి చేస్తేనే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని ప‌వ‌న్ న‌మ్ముతున్నార‌ని తెలుస్తోంది. అందుకే భీమ‌వ‌రం వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ మొగ్గు చూపుతున్నార‌ని పేర్కొంటున్నారు.

అంతేకాకుండా జూలై 17న జ‌న‌సేన పార్టీ నిర్వ‌హించే జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ భీమ‌వ‌రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల నుంచి నేరుగా వారి స‌మ‌స్య‌ల‌పై అర్జీలు స్వీక‌రించ‌నున్నారు.

ఎక్క‌డైతే పొగొట్టుకున్నామో.. అక్క‌డే సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని భీమ‌వ‌రంలో ఏర్పాటు చేశార‌ని చెబుతున్నారు.