Begin typing your search above and press return to search.

రెట్టల వర్షం.. తట్టుకోవట్లేదు..

By:  Tupaki Desk   |   15 July 2019 8:54 AM GMT
రెట్టల వర్షం.. తట్టుకోవట్లేదు..
X
కాలాలు మారిపోయాయి.. ఏ కాలంలో ఆ కాలం ఉండడం లేదు. వానాకాలంలో వానలు పడడం లేదు. చలికాలంలో చలి ఉండడం లేదు. ఎండాకాలంలో భీకరవర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. చెట్లను విపరీతంగా నరికి ప్రకృతిని, పర్యవరణాన్ని కబళిస్తున్న మనిషికి ఇప్పుడు అవే కష్టాలు దాపురిస్తున్నాయి.

అంతా హరితహారం పేరిట, గ్రీనరీ కోసం చెట్టు పెంచడం.. మొక్కలు నాటేందుకు శ్రద్ధ చూపుతుంటే... కేరళలోని ఓ చోట మాత్రం చెట్లను కొట్టేయాలని కొందరు డిమాండ్ చేస్తుండడం సంచలనంగా మారింది. ప్రభుత్వం స్థలం.. పైగా రైల్వే స్టేషన్ లో చెట్లు కొట్టేయలేమని.. అనుమతులు రావని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం చెట్లను కొట్టేయాల్సిందేనంటున్నారు.

కేరళ రాష్ట్రంలోని కొచ్చి అలువా రైల్వే స్టేషన్ సమీపంలో పెద్ద పెద్ద చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ రైల్వే స్టేషన్ నుంచి రోజువారీగా ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు పెద్దఎత్తున ప్రయాణిస్తుంటారు. వారు రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలంటే చెట్ల గుండానే వెళ్లాలి. కానీ వెళ్లడం కష్టంగా మారింది. చెట్లపై గూడులు కట్టుకున్న వందలాది పక్షులు రెట్టలు వేస్తూ ప్రయాణికులను కంపుకంపు చేస్తున్నాయి. అక్కడ అరగంట పార్క్ చేస్తే వాహనం నిండా రెట్టలు పడి మొత్తం కంపుకొడుతున్నాయి.

ఇలా రెట్టల వర్షం ఇప్పుడు అలువా రైల్వే స్టేషన్ లో నిరసనకు దారితీస్తోంది. ప్రయాణికులంతా వెంటనే అక్కడి చెట్లను కొట్టేసి పక్షులను తరిమికొట్టాలని రైల్వే స్టేషన్ అధికారులను కోరుతున్నారు.కానీ వారు మాత్రం అది తమ చేతుల్లో లేదని.. పర్యావరణాన్ని చెట్లను కొట్టేయలేమని.. పైనుంచి ఆదేశాలు రావాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో రెట్టల వర్షం కేరళ రైల్వే స్టేషన్ లో హాట్ టాపిక్ గా మారింది.