Begin typing your search above and press return to search.

రాజంపేట జిల్లా కేంద్రమవుతుందా ?

By:  Tupaki Desk   |   17 Feb 2022 5:31 AM GMT
రాజంపేట జిల్లా కేంద్రమవుతుందా ?
X
ప్రజాప్రతినిధులు, ప్రజల ఒత్తిడి ఫలించబోతోందా ? అవుననే అనిపిస్తోంది. జిల్లాల పునర్విభజన లో భాగంగా కడప జిల్లా రెండుగా విడిపోయింది. రెండో జిల్లాను రాయచోటి జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ కేంద్రం రాజంపేట కాబట్టి జనాలు, ప్రజాప్రతినిధులంతా కొత్త జిల్లా కేంద్రంగా రాజంపేటే అవుతుందని గంపెడాశతో ఉన్నారు. అయితే రాజంపేట స్ధానంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనాలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు.

కొత్త జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దని రాజంపేటే ముద్దంటు ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో రాజంపేట, రైల్వేకోడూరు వైసీపీ ఎంఎల్ఏలు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలోనే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎల్ఏలు మేడా మల్లికార్జునరెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాధరెడ్డి, కడప మేయర్ సురేష్ సీఎంను కలిశారు.

రాయచోటి స్ధానంలో ప్రభుత్వం రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు కోరారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అభ్యంతరాలను అభ్యంతరాల పరిశీలనకు నియమించిన ప్రత్యేక కమిటికి ఇవ్వమని సూచించారు. నియోజకవర్గాలకు మధ్యలో ఉంటుందని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించినట్లుందన్నారు. అయితే ఎంపీ తదితరులు మాట్లాడుతూ ప్రజాలు, ప్రజా ప్రతినిధుల ఆలోచన వేరేగా ఉంది కాబట్టి రాజంపేటనే జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు.

ఎంపీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిదులు సీఎంను కలవటం, రిక్వెస్టు చేసుకోవటం చూసిన తర్వాత జిల్లా కేంద్రం తప్పకుండా మారుతుందనే ఆశాభావంతో ఉన్నారందరు. కొత్త జిల్లాకు తాళ్ళపాక అన్నమయ్య పేరు పెట్టిన కారణంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే సరిగ్గా సరిపోతుందని కూడా వీళ్ళు జగన్ కు చెప్పారు. చూస్తుంటే జగన్ సానుకూలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకచోట మారిస్తే మరికొన్ని చోట్ల కూడా మార్చాల్సొస్తుందని అంటారా ? లేకపోతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళాలని అనుకుంటారో తెలీదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.