Begin typing your search above and press return to search.

తగ్గింది రూ.3 కాదు 32 పైసలు మాత్రమే

By:  Tupaki Desk   |   16 Jan 2016 10:21 AM IST
తగ్గింది రూ.3 కాదు 32 పైసలు మాత్రమే
X
తాము చెప్పే మాటలకు.. చేతలకు మధ్య అంతరం ఎంత భారీగా ఉంటుందన్న విషయం మోడీ సర్కారు తీరు చూస్తే అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలోని ధరల ఆధారంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించటం తెలిసిందే. ఇందుకోసం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవటం.. దీనికి కేంద్రం పచ్చజెండా ఊపేస్తుంటారు. అయితే..అనూహ్యంగా బ్రెంట్ క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్ ధరలు అందుకు తగ్గట్లే తగ్గిపోతాయని ఆశించారు.

కానీ.. ఆధాయాన్ని పెంచుకోవటమే తప్పించి.. ప్రజలకు ఆనందాన్ని మిగిల్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మోడీ సర్కారు అత్యంత పీనాసితనంతో వ్యవహరిస్తోంది. గడిచిన పన్నెండేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత భారీ పతనానికి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగజారినప్పటికి అందుకు అనుగుణంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించే విషయంలో కేంద్రం కరకు వైఖరిని ప్రదర్శిస్తోంది.

తాజాగా చూస్తే.. బ్యారెల్ క్రూడాయిల్ ధర 30 డాలర్ల కిందకు పడిపోయింది. ప్రస్తుతం 29.73 డాలర్లకు ట్రేడ్ అవుతోంది. ఇది గడిచిన పన్నెండేళ్ల కాలంలోనే అత్యల్పం. ఇంత భారీగా ధర పడిపోయిన నేపథ్యంలో లీటరు పెట్రోల్ కి రూ.3.. డీజిల్ లీటరుకు రూ.2.5 చొప్పున తగ్గిస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు భిన్నంగా.. లీటరు పెట్రోల్ మీద 32 పైసలు.. డీజిల్ మీద 85 పైసలు మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. అత్యల్ప స్థాయికి క్రూడాయిల్ ధరలు చేరుకున్నా.. వాటి ఫలాలు మాత్రం ప్రజలు పొందే అవకాశం లేకుండా పోయింది.