Begin typing your search above and press return to search.

మీ జిల్లాలో ఎలా ఉంది? మా జిల్లాలో ఎలా ఉంది? : వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఫోన్ కాల్స్‌

By:  Tupaki Desk   |   3 April 2021 8:30 AM GMT
మీ జిల్లాలో ఎలా ఉంది?  మా జిల్లాలో ఎలా ఉంది? :  వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఫోన్ కాల్స్‌
X
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న‌తో ఉన్నారు. ``ప‌దేళ్లుగా జెండా మోస్తున్నాం.. పార్టీ కోసం రోడ్డు ప‌ట్టుకుని పాద‌యాత్ర‌లు చేశాం. కానీ, మాకు క‌నీసం .. ఏ ప‌నీ చేయ‌డం లేదు. మ‌మ‌ల్ని క‌నీసం వ‌లంటీర్ కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు`` అని వారు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యంపై పొరుగు జిల్లాల కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి.. `మాదగ్గ‌ర ప‌రిస్థితి ఇలా ఉంది. మీ జిల్లాలో ప‌రిస్థితి ఎలా ఉంది?`` అని వాక‌బు చేస్తున్నారు. దీంతో పొరుగు జిల్లాల్లోని కార్య‌క‌ర్త‌లు కూడా ఇదే త‌ర‌హా అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌వానికి ఏ పార్టీకైనా.. జెండా మోసేందుకు, నినాదాలు చేసేందుకు, నాయ‌కుల‌కు జై కొట్టేందుకు కార్య‌క‌ర్త లే ప్ర‌ధానం. నాయ‌కులు ఎంత‌టి వారైనా కార్య‌క‌ర్త‌లు లేక‌పోతే.. క‌ష్ట‌మే. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కార్య‌క ‌ర్త‌లు మ‌రీ డిఫ‌రెంట్‌. ఈ పార్టీలో కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని ఓన్ చేసుకుని ముందుకు తీసుకువెళ్లారు. పార్టీని త‌మ సొంత పార్టీగా భావించారు. అంతేకాదు.. పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు కార్య‌క‌ర్త‌లు అహోరాత్రులు క‌ష్ట‌ప‌డ్డారు. ఈ విష‌యంలో ఏ ఒక్క‌రినీ ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. కానీ, కార్య‌క‌ర్త‌లు మాత్రం ఇప్పుడు డ‌మ్మీ అయిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది.

కార్య‌క‌ర్త‌లు కూడా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏవో వారి స్థాయిలో వారు చిన్న చిన్న ప‌నులు చేయించుకోవాల‌ని అనుకుంటారు. ఏ రేష‌న్ కార్డో.. అమ్మ ఒడో(అర్హ‌త‌నుబ‌ట్టి), ఇంటి ప‌ట్టానో పొందాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే.. వీరితో ప‌నిచేయించుకుని గెలుపు గుర్రం ఎక్కిన ఎమ్మెల్యేలు కానీ, పార్టీ అధిష్టానం కానీ.. ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల‌ను ఎక్క‌డా ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌ళ్లీ ఐదేళ్ల‌కు క‌దా.. వీరితో ప‌ని అనుకుని మిన్న‌కుంటున్నారు. పోనీ.. క్షేత్ర‌స్థాయిలో వ‌లంటీర్లు అయినా.. ప‌ట్టించుకుని వీరికి ప‌నిచేసి పెడుతున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.

దీంతో ప్ర‌తి జిల్లాలోనూ కార్య‌క‌ర్త‌లు అలో ల‌క్ష్మ‌ణా! అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ``మాకు ప‌నులు కావ‌డం లేదు. చేతిలో చిల్లి గ‌వ్వ కూడా లేదు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు బాగానే పోగేసుకున్నారు. మ‌నం మాత్రం రోడ్డున ప‌డ్డాం`` అని కార్య‌క‌ర్త‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. అలాగ‌ని జ‌గ‌న్‌ పై అభిమానం లేదా? అంటే.. గంపెడంత ఉంది. దీంతో పార్టీని విడిచి పెట్ట‌లేక‌.. ప‌ది రూపాయల ఆదాయం లేక వైసీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర న‌ర‌కం చ‌విచూస్తున్నారు. ప‌రిస్థితి వ‌చ్చే రెండేళ్లు కూడా ఇలానే ఉంటే.. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీకి గుడ్ బై చెప్పేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ క్ర‌మంలో అప్పుడు మ‌ళ్లీ పీకే(ప్ర‌శాంత్ కిశోర్‌) వ‌చ్చి క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పి.. ఓట్ల కోసం రంగంలోకి దింపే ప‌రిస్థితి ఉంటుంద‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. ఇక‌, ఈ ప‌రిస్థితి గ్రామాల్లోనూ క‌నిపిస్తోంది. త‌మ‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వాడుకుని వ‌దిలేస్తున్నార‌ని కార్య‌క‌ర్త‌లు ల‌బోదిబోమంటున్నారు. ఈ నేప‌థ్యంలో అధిష్టానం ఇప్ప‌ట‌కైనా వారిని ప‌ట్టించుకుంటుందో లేదో చూడాలి.