Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు వారికోసం మోడీ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   20 Jun 2020 11:30 AM GMT
ఎట్టకేలకు వారికోసం మోడీ కీలక నిర్ణయం
X
కరోనా లాక్ డౌన్ తో కుదేలైన దేశానికి ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఊపిరిలూదలేదనే అపవాదు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక ముందుడుగు వేశారు. వలస కార్మికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు మేలు చేకూర్చేలా ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ అనే పథకాన్ని తాజాగా ప్రధాని మోడీ ప్రారంభించాడు. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ పథకానికి మోడీ శ్రీకారం చుట్టారు.

గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పథకాన్ని మోడీ ప్రారంభించాడు. గ్రామీణులకు, వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామన్నారు. దాదాపు 25 పథకాల సేవలను ఒకే చోటు నుంచి అందిస్తామని వివరించారు. 125 రోజుల పాటు ఈ కొత్త పథకం అందుబాటులో ఉంటుందన్నారు. దీనికోసం 50వేల కోట్లు వెచ్చిస్తున్నారు.

అయితే ఈ భారీ పథకంలో తెలంగాణ, ఏపీలకు చోటు దక్కకలేదు.. ప్రస్తుతం ఈ 50వేల కోట్ల పథకం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశాలలో మాత్రమే కేంద్రం అమలు చేస్తోంది. వచ్చే 4 నెలల పాటు గ్రామస్థులకు ఉపాధి కల్పిస్తారు. తర్వాత ఎవరి పనులకు వారు వెళ్లిపోవచ్చు. వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో బీహార్, యూపీ సీఎంలతోపాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి , వివిధ రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.