Begin typing your search above and press return to search.

పవన్‌పై రెక్కీ.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు!

By:  Tupaki Desk   |   5 Nov 2022 4:46 AM GMT
పవన్‌పై రెక్కీ.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు!
X
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇంటివద్ద కొద్ది రోజుల క్రితం గలాటా సృష్టించిన కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

ముగ్గురు యువకులు.. ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణ సమీపంలోని పబ్‌లో మందు తాగి వస్తూ పవన్‌ ఇంటి సమీపంలో రోడ్డుపైన కారు ఆపారని వెల్లడించారు. ఇది గమనించిన పవన్‌ సెక్యూరిటీ సిబ్బంది ఆ కారును తీయాలని కోరగా.. ముగ్గురు యువకులు వారితో గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు. తాగిన మైకంలోనే సెక్యూరిటీతో గొడవ పడ్డామని యువకులు తెలిపారని చెప్పారు.

పవన్‌ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ నిర్వహించలేదని.. ఇందులో ఏ కుట్ర కోణం లేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు తేల్చారు. కుట్ర, రెక్కీ అనేవి కేవలం కల్పితాలేనన్నారు. పవన్‌ ఇంటి వద్ద యువకులు ఆపిన కారు సాయికృష్ణది అని, అది గుజరాత్‌ రిజిస్ట్రేషన్‌తో ఉందని చెప్పారు.

కాగా విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించి వచ్చినప్పటి నుంచి ఆయనను కార్లలో, బైకుల పైన గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. పవన్‌ రాకపోకలను, ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కొంతమంది వ్యక్తులు అనుసరిస్తున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైదరాబాద్‌ పోలీసులు పవన్‌ ఇంటి వద్ద రెక్కీ, కుట్ర వంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు. ముగ్గురు యువకులు కేవలం మందు తాగిన మత్తులోనే పవన్‌ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారని వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.