Begin typing your search above and press return to search.

ఐపీఎల్ తో పొలిటికల్ లింకేంటండీ..!

By:  Tupaki Desk   |   31 May 2022 12:30 AM GMT
ఐపీఎల్ తో పొలిటికల్ లింకేంటండీ..!
X
రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభమై.. అందరినీ అలరించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆదివారం ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతేరాలోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్ కు లక్షా 5 వేల మంది హారజరయ్యారంటేనే ఈసారి లీగ్ కు ఎంతటి ఆదరణ లభించిందో తెలుసుకోవచ్చు. వాస్తవానికి ఐపీఎల్ కు ఎప్నుడూ అభిమానుల కొరత ఉండదు. కానీ, కొవిడ్ కారణంగా అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ దెబ్బతిన్నది. ఎన్నడూ లేనివిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సంబరమైన ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. క్రికెట్ టి20 ప్రపంచ కప్ దీ అదే పరిస్థితి. బహుశా వన్డే ప్రపంచ కప్, ఫుట్ బాల్ వరల్డ్ కప్ అప్పటికే అయిపోవడంతో బతికిపోయాయి. కాగా, ఈసారి ఐపీఎల్ స్వదేశంలో పూర్తిగా జరిగింది. లీగ్ ప్రారంభం నాటికి కొవిడ్ మూడో వేవ్ భయం ఉండడంతో మ్యాచ్ లను నాలుగు వేదికలకే పరిమితం చేశారు. అయితే, ప్లేఆఫ్స్, ఫైనల్ వేరేచోట నిర్వహించారు.

క్రికెట్ కు కాషాయ రంగు

ఐపీఎల్ లో ఈసారి గుజరాత్ టైటాన్స్, లఖ్నో సూపర్ జెయింట్స్ కొత్తగా వచ్చిన జట్లు. దీంతో లీగ్ లో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. మరోవైపు ఈ రెండు జట్లూ ప్లేఆఫ్స్ కు చేరాయి. అద్బుత ఆటతీరుతో ఆకట్టుకున్నాయి. వీటి జోరులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పనైపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుకెళ్లలేకపోయాయి. ఇక ప్లే ఆఫ్స్ చేరిన మరో రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అంటే.. గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్, లక్నో ప్లేఆఫ్స్ కు వచ్చాయి.

ఇక్కడే కొందరు తమ బుర్రలకు పదును చెప్పి పొలిటికల్ టచ్ తో సోషల్ మీడియాలో కామెంట్లు వదిలారు. అదేమంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మూడు జట్లు (గుజరాత్, బెంగళూరు, లక్నో) ప్లే ఆఫ్స్ చేరాయంటూ ఓ విశ్లేషణ తీసుకొచ్చారు. కాస్త ఆగి ఆలోచించేవారికి ఇది నిజమే అనిపిస్తుంది. కానీ, ప్లే ఆఫ్స్ చేరిన.. ఫైనల్ వరకూ వెళ్లిన మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తించడం లేదు.

ఫైనల్ కు భలే టచ్

ఇక ఆదివారం ఫైనల్ రాజస్థాన్, గుజరాత్ మధ్య అహ్మదాబాద్ సమీప మొతేరా లోని ''నరేంద్ర మోదీ'' అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. దీనికి కేంద్ర హోం మంత్రి, గుజరాత్ కే చెందిన అమిత్ షా హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సహా ఇతర పెద్దలూ పాల్గొన్నారు. అదివేరే విషయం. ఇక్కడే కొందరు విమర్శక విశ్లేషకులు మరో తరహా వాదనకు దిగారు.

ఫైనల్ జరిగింది అహ్మదాబాద్ లో అని.. అందులో ఒక జట్టు గుజరాత్ అని.. కచ్చితంగా అదే గెలుస్తుందని.. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాతీ నరేంద్ర మోదీ అని కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టి సరదా వ్యాఖ్యలు చేశారు. అంతేకాక కొందరు ఇంకాస్త ముందుకెళ్లి గుజరాత్ జట్టు.. పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీకి చెందినదంటూ ప్రచారం చేశారు. ఇంకేం ఆ జట్టే గెలుస్తుందంటూ నోళ్లకు పనిచెప్పారు. కానీ, గుజరాత్ ఫ్రాంచైజీ లగ్జెంబర్గ్ కు చెందిన సంస్థది. వాస్తవానికి ఇదంతా ఉబుసుపోక చెప్పే కబుర్లు.

క్రీడాస్పూర్తి చూడరా?

వాస్తవానికి లీగ్ లో అత్యద్భుతంగా ఆడింది గుజరాత్. దాని ఫలితమే టైటిల్. ఆల్ రౌండ్ ఆటకు పెట్టింది పేరుగా నిలిచింది. స్టార్లు లేకున్నా నిలకడతో విజయాలు సాధించింది. వారి గెలుపులో ఏమాత్రం సందేహం లేదు. క్రీడా స్పూర్తితో చూడాల్సిన విజయమిది. కానీ, పనిలేని వారు ఏదో కామెంట్లు చేసి చర్చరేపారు.

''పింకీస్ లాస్ట్ '' అంటూ మాజీ ఎంపీ ట్వీట్

ఇదిలాఉండగా.. గుజరాత్ జెర్సీ నేవీ బ్లూ. రాజస్థాన్ జెర్సీ పింక్. ఫైనల్లో గుజరాత్ గెలుపును ప్రస్తావిస్తూ తెలంగాణ మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు ''పింకీస్ లాస్ట్'' అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆ ఎంపీ.. అత్యంత ప్రముఖ కుటుంబానికి చెందినవారు. ఇక్కడ పింకీ అంటే గులాబీ.. టీఆర్ఎస్ పార్టీ అని అర్థం. ఆ పార్టీ నుంచి గతంలో ఆయన ఎంపీగానూ పోటీచేశారు. మధ్యలో కాంగ్రెస్ లో ఉన్నా.. ఇప్పుడు పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. అదికూడా బీజేపీలోకి వెళ్తారని చెబుతున్నారు. మరిప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ టైటిల్ గెలిచింది. అంటే ఆయన బీజేపీలో చేరతారా?