Begin typing your search above and press return to search.

న‌ల్లారి కుటుంబంలో పొలిటిక‌ల్ వార్‌.. త‌మ్ముడి ముఖం చూడ‌ని మాజీ సీఎం

By:  Tupaki Desk   |   22 March 2022 4:32 AM GMT
న‌ల్లారి కుటుంబంలో పొలిటిక‌ల్ వార్‌.. త‌మ్ముడి ముఖం చూడ‌ని మాజీ సీఎం
X
న‌ల్లారి కుటుంబంలో రాజ‌కీయం వేడెక్కింది. మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు, ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తి గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. న‌ల్లారి కుటుంబం. ఇప్పుడు దాదాపు అంద‌రూ మ‌రిచిపోయి ఉంటారు. ఎందుకంటే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఈ పేరు పెద్ద‌గా వినిపించ‌డం లేదు. కానీ, విభ‌జ‌న‌కు ముందు.. ఉమ్మ‌డి రాష్ట్రానికి రోశ‌య్య త‌ర్వాత‌.. ముఖ్య మంత్రి అయిన‌.. న‌ల్లారి కిర‌ణ్‌కుమా ర్ రెడ్డి.. ఉమ్మ‌డి ఏపీ కోసం.. చాలానే త‌పించారు. అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుకు వ్య‌తిరేకంగా తీర్మానం చేయ‌డంలోనూ.. ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు.

అయినా.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 'స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పార్టీ' స్థాపించారు కిర‌ణ్‌. 2014 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌క‌పోయినా.. చాలా మందికి టికెట్టు ఇచ్చారు. అయితే.. డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌టి నుంచి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఊసు ఎక్క‌డా వినిపించ‌లేదు. అయితే.. త‌ర్వాత 2020కి ముందు.. ఆయ‌న తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్‌రెడ్డి ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ హ‌యాంలో వ‌రుస విజ‌యాలు సాధించారు.

ఈ నేప‌థ్యంలోనే కిర‌ణ్ కుమార్ సోద‌రుడు కిశోర్ కుమార్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కిర‌ణ్ హైద‌రాబాద్‌లో చ‌క్రం తిప్పితే.. కిశోర్‌.. పీలేరులో రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టేవారు. అయితే.. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. 2017లో రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు నేత‌లు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే కిశోర్ కుమారెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ త‌ర్వాత‌.. 2019లో టీడీపీ త‌ర‌ఫున పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆది నుంచి టీడీపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పిన న‌ల్లారి ఫ్యామిలీ.. ఇలా టీడీపీలో చేర‌డం.. కిర‌ణ్‌కు ఇష్టం లేదు. అయినా.. అన్న‌మాట ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే కిశోర్ టీడీపీ లో చేర‌డం.. పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోవ‌డం.. జ‌రిగిపోయాయి.

ఇప్పటికీ కిశోర్ కుమార్‌రెడ్డి టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్ర‌మంలో కిర‌ణ్‌.. చిత్తూరు జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నా.. కలికిరి మండలంలోని సొంతూరు నగరిపల్లికి వెళ్లలేని పరిస్థితి ఏర్ప‌డింది. టీడీపీ కీలక నేతగా.. తన తమ్ముడు నల్లారి కిశోర్‌, ఆ ఇంటి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నారట. దీంతో, కాంగ్రెస్‌ కండువా వేసుకుని.. పసుపు జెండా పట్టుకున్న తమ్ముడి ఇంటికి వెళ్లడానికి కిరణ్‌ ఇష్టపడం లేదట. దీంతో, కలికిరి వచ్చినా.. అప్పట్లో సీఎంగా తాను కట్టించిన ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌజ్‌లోనే బసచేసి నేతలతో మాట్లాడి వెళ్లిపోతున్నారట‌.

తమ్ముడు కిశోర్‌ తీరు వల్లే కిరణ్‌ ఐదేళ్లుగా సొంతూరి ముఖం చూడలేకపోతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గెస్ట్‌ హౌజ్‌కు కిలోమీటర్‌ దూరంలోనే ఉన్నా.. సొంతింటివైపు కిరణ్‌ కన్నెత్తి చూడటం లేదంటున్నారు స్థానికులు. దీంతో నల్లారి సోదరుల మధ్య రాజకీయ విభేదాలతో.. నియోజకవర్గ కేడర్‌ కూడా రెండుగా చీలిపోయిందట. కిషోర్ టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ.. కిరణ్‌ ముఖ్య అనుచరుల్లో చాలామంది ఆయన డైరెక్షన్‌లోనే నడుస్తున్నారట.

అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కుటుంబంలోనూ, బంధువుల్లోనూ చీలిక వచ్చిందట. మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో ఆగుతుందా.. లేక మున్ముందు కొన‌సాగుతుందా చూడాలి.