Begin typing your search above and press return to search.

ఆ మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలో నాలుగో కృష్ణుడు!

By:  Tupaki Desk   |   16 Dec 2022 10:30 AM GMT
ఆ మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలో నాలుగో కృష్ణుడు!
X
గుంటూరు జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గం.. తాడికొండ. ఈ నియోజకవర్గానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత అంటే రాజధాని అమరావతి ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే విస్తరించి ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. స్వతహాగా ఆమె వైద్యురాలు. అయితే గెలిచిన తర్వాత ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో ముగ్గురు నేతల మధ్య మూడు ముక్కలాట నెలకొందని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తాడికొండ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున డొక్కా మాణిక్యవరప్రసాద్‌ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2014లో టీడీపీ తరఫున శ్రావణ్‌ కుమార్‌ గెలిచారు. 2019లో ఈయన ఉండవల్లి శ్రీదేవిపై ఓడిపోయారు.

తదనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కూడా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతేకాకుండా తాజాగా శాసనమండలిలో విప్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా కూడా డొక్కాను వైఎస్సార్సీపీ అధిష్టానం నియమించింది. మళ్లీ ఇటీవల గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ను నియమించింది.

ఈ నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్‌ కుమార్‌ ను వైసీపీ అధిష్టానం నియమించింది. 2014 ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన హెన్రీ క్రిస్టీనా భర్తే ఈ కత్తెర సురేష్‌ కుమార్‌. ప్రస్తుతం హె న్రీ క్రిస్టీనా గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా కొనసాగుతున్నారు.

ఇంకోవైపు ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ కూడా తాడికొండ నియోజకవర్గానికి చెందినవారే. తాడికొండ.. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే బాపట్ల ఎంపీగా గెలుపొందిన నందిగం సురేష్‌ ఎక్కువ తన నియోజకవర్గం తాడికొండలోనే ఉంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. అలాగే వైఎస్సార్సీపీ మరోసారి గెలిచి అధికారంలోకి వస్తే మంత్రి కూడా కావాలని ఉబలాటపడుతున్నట్టు సమాచారం.

కాగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి.. నియోజకవర్గంలో మండల స్థాయి పార్టీ నేతలతో సఖ్యత లేదని గతంలో వార్తలు వచ్చాయి. మండల స్థాయి నేత ఒకరు శ్రీదేవిపై ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. మరోవైపు అసలు ఆమె ఎస్సీ కాదనే వివాదమూ నడిచింది. అయితే గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆమె ఎస్సీనే అని ధ్రువీకరించడంతో గొడవ సద్దుమణిగింది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి సీటు రాదని చెప్పకుంటున్నారు. ఈ కోణంలోనే నియోజకవర్గ అదనపు ఇన్‌చార్జిగా కత్తెర సురేష్‌ కుమార్‌ను నియమించారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ను ఇంతకు ముందు అదనపు సమన్వయకర్తగా నియమించడంపై ఉండవల్లి శ్రీదేవి భగ్గుమన్నారు. భారీ ఎత్తున ఆమె అనుచరులు, మండల స్థాయి నేతలు ఆందోళనకు దిగారు. ఏకంగా నాటి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు ధర్నాకు దిగారు.

అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్‌ జిల్లా అధ్యక్ష పదవిలోకి వెళ్లడంతో ఇక తనకు అడ్డులేదని ఉండవల్లి శ్రీదేవి భావించారు. అయితే ఇంతలోనే కత్తెర సురేష్‌ కుమార్‌ రూపంలో ఆమెకు మరో అడ్డంకి వచ్చిపడింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.