Begin typing your search above and press return to search.

6పీఎం తర్వాత.. ఏపీలో పోలింగ్ ఎన్నిచోట్ల జరిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   12 April 2019 10:30 AM IST
6పీఎం తర్వాత.. ఏపీలో పోలింగ్ ఎన్నిచోట్ల జరిగిందో తెలుసా?
X
సాధారణంగా ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్..సాయంత్రం ఐదు గంటల వరకూ సాగుతుంది. ఒకవేళ ఐదు గంటల సమయానికి క్యూలో ఎంతమంది అయితే ఉంటారో.. అంతమంది తమ ఓటుహక్కు నిర్వహించుకోవటానికి వీలుగా ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు. ఏపీలో అసెంబ్లీ.. లోక్ సభ పోలింగ్ జరుగుతుండటంతో.. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు. అయితే.. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటం.. సాంకేతికంగా సమస్యలు ఎదుర్కోవటంతో పోలింగ్ ఆలస్యంగా సాగింది.

సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. వేలాది పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సాగుతూ ఉండటం కనిపించింది. ఇది వందో.. వెయ్యో కాదు.. ఏకంగా 6వేల కేంద్రాల్లో పోలింగ్ సాగటం విశేషం. సాయంత్రం 6 గంటలకు ఆరు వేల కేంద్రాల్లో పోలింగ్ సాగితే.. రాత్రి 9.15 గంటలకు 726 చోట్ల.. రాత్రి 10.25 గంటలకు 256 చోట్ల.. రాత్రి 10.30 గంటలకు 139 చోట్ల.. రాత్రి 11 గంటలకు 70 చోట్ల.. రాత్రి 11.30 గంటలకు 49 చోట్ల.. రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా 23 చోట్ల పోలింగ్ సాగటం విశేషం.

ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఏపీలో పోలింగ్ సాగిన తీరు చూస్తే.. ఎన్నికల నిర్వహణలో ఈసీది అత్యంత చెత్త రికార్డు ఇదేనన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈవీఎంలు చక్కగా పని చేసి ఉంటే.. పోలింగ్ నమోదులో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.