Begin typing your search above and press return to search.

కరోనా వేళ మందులను మింగేస్తున్న మాఫియా

By:  Tupaki Desk   |   3 Aug 2020 5:00 AM IST
కరోనా వేళ మందులను మింగేస్తున్న మాఫియా
X
కరోనా వేళ ఇప్పుడు అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్ సీ, డీ, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో పాటు జ్వరం, ఒళ్లు నొప్పులకు వాడే డోలో 650 వంటి మందులకు డిమాండ్ బాగా పెరిగింది.

దీంతో మెడికల్ మాఫియా రంగంలోకి దిగి కృష్ణా జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, మందుల దుకాణాలతో టై అప్ అయ్యి తమ మందులనే కొనాలంటూ బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాఫియా సరఫరా చేసే మందుల నాణ్యత నాసిరకంగా ఉండడం.. చెప్పినట్టు వినకుంటే ఔషధ నియంత్రణశాఖ అధికారులతో దాడులు చేయిస్తామని కొందరు అధికార పార్టీ నేతలతో కలిసి ఈ బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. ఈ మందుల దందా ద్వారా నెలకు సుమారు రూ.50 కోట్ల మేర ఆర్జిస్తున్నట్టు సమాచారం.

ఇక సర్జికల్ షాపుల నుంచి కమీషన్లు తీసుకొని మరీ ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండని అధికార పార్టీ నేత అనుచరుడు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ధరలను ఏకంగా రూ.100 ఉంటే రూ.600 వరకు అమ్ముతూ విక్రయిస్తున్నారు. గ్లోవ్స్, ఎన్95 మాస్కులను ఐదు రెట్లు పెంచి అమ్ముతూ జనాల నడ్డి విరుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కరోనా టైంలోనూ మందులు, వైద్య పరికరాల్లో భారీగా రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని జిల్లాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.