Begin typing your search above and press return to search.

అవ‌మానాన్ని కూడా ఆస్వాదిస్తున్న‌ టీడీపీ నేత‌లు?!

By:  Tupaki Desk   |   25 Jun 2020 3:30 AM GMT
అవ‌మానాన్ని కూడా ఆస్వాదిస్తున్న‌ టీడీపీ నేత‌లు?!
X
తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌చార ప్రియ‌లు బ‌హిరంగ ర‌హ‌స్యం! సంద‌ర్భం ఏదైనా వారు త‌మకు అనుకూలంగా దాన్ని ప్ర‌చారం చేయించుకోవ‌డంలో ముందుంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెప్తుంటాయి. అయితే, తాజాగా తెలుగుదేశం పార్టీ నేత‌లు తీసుకున్న నిర్ణ‌యం వారినే న‌వ్వుల పాలు చేసేలా ఉంద‌ని అంటున్నారు. రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థి ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన గాయాన్ని కావాల‌ని గుర్తుకు చేసుకొని మ‌రీ ఆ అవ‌మానాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేలా ఆ పార్టీ నేత‌ల వైఖ‌రి ఉందంటున్నారు. ఇదంతా ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదిక కూల్చి వేత‌, టీడీపీ నేత‌ల ప్ర‌స్తుత నిర్ణ‌యం గురించి.

ఏపీ సీఎం ప‌గ్గాలు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన అనంత‌రం అక్ర‌మ నిర్మాణాల‌ పై క‌న్నేసి అందులో భాగంగానే ప్ర‌జావేదిక‌ను కూల్చివేశారు. దానిపై అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు భ‌గ్గుమ‌న్నారు. మ‌రోవైపు ప్ర‌జా వేదిక కూల్చి వేత‌కు గురువారం నాటికి ఏడాది. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందంటే... టీడీపీ అధినేత ప్ర‌త్యేకంగా నిర్మించిన ఈ ప్ర‌జావేదిక‌ను కూల్చి సంవత్సర కాలం గడిచినప్ప‌టికీ… అక్కడి చెత్త‌‌ను కూడా తొలగించకుండా అలాగే వదిలేశారు. ఈ ప‌రిస్థితి కి కార‌ణం ఏంట‌నేది వేరే విష‌యం.

అయితే, ప్ర‌జావేదిక కూల్చివేత నిర్ణ‌యంపై అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా ప్ర‌స్తావిస్తున్నారు. ఇక తాజాగా ప్ర‌జావేదిక కూల్చి వేసి ఏడాది గడచిన సందర్భంగా గురువారం ప్రజావేదిక ప్రదేశాన్ని మరోసారి పరిశీలించనున్నారట టీడీపీ నేత‌లు. ఇంత‌కీ ఈ ప‌రామ‌ర్శ ఎందుకో? చెత్త కూడా తీయలేద‌ని గుర్తు చేసేందుకా? త‌మ ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణాన్ని పాల‌న ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే జ‌గ‌న్ స‌ర్కారు కూల్చివేసింద‌ని గుర్తు చేసుకొని క‌ల‌త చెందేందుకా? టీడీపీ నేత‌ల‌కే తెలియాలి. ఒక‌వేళ, జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్ప‌డం అనేది టీడీపీ నేత‌ల వాద‌న అయితే...అంత‌కు మించిన రాజ‌కీయ కామెడీ మ‌రొక‌టి ఉండ‌ద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.