Begin typing your search above and press return to search.

మునిగిన బోటు వెలికితీతపై జగన్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   29 Sept 2019 12:09 PM IST
మునిగిన బోటు వెలికితీతపై జగన్ కీలక నిర్ణయం
X
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన 20 రోజులు దాటడంతో ఇక బోటును తీయడం సాధ్యం కాదని వదిలేసిన వైసీపీ సర్కారు తాజాగా ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేవీ సిబ్బంది, ఎన్టీఆర్ ఎఫ్ - ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందితోపాటు ఉత్తరాంఖండ్ కు చెందిన నిపుణుల బృందం సైతం బోటు వెలికితీసేందుకు ఎంతో ప్రయత్నించి విఫలమైంది. ఉధృతంగా ఉన్న గోదావరి ప్రవాహంతో ఇది సాధ్యం కాదని తేల్చారు.

దీంతో తాజాగా బోటు వెలికితీయడంలో అనుభవం ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తులకు ఈ ఆర్డర్ ను ఇస్తూ వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. గోదావరిలో వరద ప్రవాహం తగ్గిపోయాక ఈ బోటును వెలికి తీయాలని పేర్కొంది. దీనికి ‘ఆపరేషన్ రాయల్ వశిష్ట’ అనే పేరును కూడా పెట్టింది. బోటు వెలికితీత కోసం రూ.22.70లక్షల కాంట్రాక్టును సైతం వారికి ఇచ్చింది.

కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం ఈ బోటు వెలికితీత పనులు దక్కించుకున్నాడు. ఈ ఆపరేషన్ లో పాల్గొనే వారందరికీ రిస్క్ కవరేజ్ కూడా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం మునిగిన బోటులో 15మంది వరకూ ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 35 మందిని వెలికితీశారు. బోటులోని ఏసీ క్యాబిన్ లోనే వీరంతా మృత్యువాత పడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.