Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ పై పురంధేశ్వరి తాజా వ్యాఖ్యలు విన్నారా?

By:  Tupaki Desk   |   4 Sep 2021 12:30 PM GMT
స్టీల్ ప్లాంట్ పై పురంధేశ్వరి తాజా వ్యాఖ్యలు విన్నారా?
X
ప్రజల్లో పలుకుబడి ఉండటం అందరికి సాధ్యమయ్యేది కాదు. అయితే.. తమకున్న ఇమేజ్ ను సరైన ప్లానింగ్ లేకుండా చేజేతులారా చెడగొట్టుకునే నేతలు కొందరు ఉంటారు. అలాంటివారి లెక్కలు ఏమిటో? వారు వినిపించే వాదనలు తమ రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ తీస్తాయన్న విషయాన్ని తెలుసుకోకుండా ఎందుకు తప్పులు చేస్తారో ఒక పట్టాన అర్థం కాదు. ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్టీవోడు కాకుండా రాజకీయంగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న వారెవరైనా ఉన్నారంటే.. వారిలో పురంధేశ్వరి ముందుంటారు.ఆమెపై ఎలాంటి అంచనాలు లేనప్పటికీ.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆమె తన సత్తాను చాటారు.

దీనికి తోడు విషయాల పట్ల ఆమెకున్న అవగాహన.. అనవసరమైన అంశాల జోలికి వెళ్లకుండా ఆమె చాలామందికి దగ్గరయ్యారు. నందమూరి కుటుంబం నుంచి అసలుసిసలు నేత ఎలా ఉంటారన్నట్లుగా ఆమె పేరు వినిపించేది. అలాంటి ఆమె.. రాష్ట్ర విభజన వేళలో అనుసరించిన వైఖరి.. ఆమెకు లాభం కంటే నష్టాన్నే కలుగజేసింది. కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేసి బీజేపీలోకి వెళ్లినప్పటికీ.. తనదైన మార్కును చూపించలేకపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన కొన్నేళ్లుగా అవసరమైన అంశాల కంటే కూడా అనవసరమైన విషయాల మీదనే ఆమె ఎక్కువగా ఫోకస్ చేయటం.. వివాదాల్లో కూరుకుపోవటం తరచూ జరుగుతోంది.

తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మంట పుట్టేలా ఉన్నాయని చెప్పాలి. ఒంటికి కారం రాస్తే ఎలా ఉంటుందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆమె తాజా మాటలు ఉన్నాయని చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్లదని.. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూస్తామని.. మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తామని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. విశాఖ ప్లాంట్ అంటే.. భౌతికంగా కనిపించే ఫ్యాక్టరీ.. అందులో పని చేసే ఉద్యోగులు మాత్రమే అని పురంధేశ్వరి పొరపడినట్లున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక ఎంతో భావోద్వేగం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

దాదాపు రూ.2లక్షల కోట్ల విలువైన ప్రజాఆస్తిని రూ.33వేల కోట్లకు కారచౌకగా కట్టబెట్టటంపై ఏపీ ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు.. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కాకుండా లాభాల్లో ఉన్న వేళ.. దాన్ని అమ్మేయాలని చూడటం వెనుక లాజిక్ ఏమిటన్నది కేంద్రం ఇప్పటికి చెప్పలేకపోతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మకంతో ఉద్యోగుల భద్రత కోణంలోనూ.. ప్రజల ఉద్యమాన్ని.. ఆగ్రహాన్ని పరిమిత కోణంలో చూస్తున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

తాజాగా మాట్లాడిన ఆమె.. ‘‘మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి. మౌలిక సదుపాయాలకు వనరులు అవసరం. ఐదు రంగాల్లో నిరర్ధక ఆస్తులను వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. అలాంటి నిరుపయోగ ఆస్తులు వినియోగించుకోవడం మేం సమ్మతిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు. ఉద్యోగులకు ప్యాకేజీ ఇవ్వడం, వారిని ఆదుకునే అంశంపై ఆలోచిస్తాం. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని పురంధేశ్వరి మర్చిపోయి.. ఉద్యోగుల ప్యాకేజీ గురించి మాట్లాడటం ఆమె ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల మూడ్ ను పట్టించుకోకుండా విశాఖ స్టీల్ మీద ఆమె మాటలు.. రాజకీయంగా ఆమెకు డ్ాయమేజ్ గా మారతాయని చెప్పక తప్పదు.