Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి దగ్గుబాటి ఔట్.. కారణం చెప్పిన పురంధేశ్వరి

By:  Tupaki Desk   |   29 Oct 2019 9:49 AM GMT
వైసీపీ నుంచి దగ్గుబాటి ఔట్.. కారణం చెప్పిన పురంధేశ్వరి
X
దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అల్లుడు. చంద్రబాబు - దగ్గుబాటి ఇద్దరు అల్లుళ్లను ఎన్టీఆర్ సమానంగా చూసేవారు. కానీ బాబు ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఎన్టీఆర్ ను కూలదోసి తెలుగుదేశం పగ్గాలు చేపట్టాడు. అది నచ్చని దగ్గబాటి.. చంద్రబాబు తీరును నిరసిస్తూ తెలుగుదేశం నుంచి వైదొలిగారు. నాటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చిన దగ్గుబాటి మొన్నటి ఎన్నికల వేళ మాత్రం వైసీపీకి జైకొట్టారు. తన కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీలో చేరారు. అయితే అప్పటికే ఆయన భార్య పురంధేశ్వరి బీజేపీలో కీలకంగా ఉన్నారు. దగ్గుబాటి వైసీపీలో - పురంధేశ్వరి బీజేపీలో కొనసాగారు. అయితే రాజకీయంగా ఈ రెండు పార్టీలు వేరు వేరు. అందుకే పురంధేశ్వరి తన భర్త ఉన్న వైసీపీ పార్టీని తిట్టడం.. జగన్ పై విమర్శలు చేయడం వైసీపీని ఇరుకునపెట్టింది.

దీంతో భర్త వైసీపీ - భార్య బీజేపీలో ఉండడం తగదంటూ వైసీపీ నుంచి దుగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అల్టీమేటం జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. పురంధేశ్వరినీ కూడా వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుబాటికి జగన్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా కొనసాగుతోంది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఈ వివాదంపై తొలిసారి స్పందించారు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినప్పుడే.. తనను చేరాలని వైసీపీ నుంచి ఆహ్వానం అందిందని పురంధేశ్వరి తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి ఆహ్వానం రాలేదని ఆమె వివరణ ఇచ్చారు.ఆ సమయంలోనే తామిద్దరం వేరు వేరు పార్టీలో ఉంటామని... తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా వైసీపీ అధిష్టానానికి చెప్పినట్లు పురంధేశ్వరి వివరించారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ నేతలు అంగీకరించిన తర్వాత నా భర్త - కుమారుడు వైసీపీలో చేరారని.. తాను బీజేపీలోనే కొనసాగనని పురంధేశ్వరి తెలిపారు.

అయితే ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉండాలని ఒత్తిడి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని.. ఆ విషయం తన భర్తనే అడగాలని పురంధేశ్వరి స్పష్టం చేశారు. తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేసినట్టు అయ్యింది.