Begin typing your search above and press return to search.

అపార నిధులు.. నాడు అనంత ప‌ద్మ‌నాభస్వామి.. నేడు పూరీ జ‌గ‌న్నాథ్!

By:  Tupaki Desk   |   30 Aug 2022 5:00 AM GMT
అపార నిధులు.. నాడు అనంత ప‌ద్మ‌నాభస్వామి.. నేడు పూరీ జ‌గ‌న్నాథ్!
X
అపార ధ‌న రాశుల‌తో, వెల‌క‌ట్ట‌లేని వ‌జ్ర‌, వైఢూర్యాల‌తో తిరువ‌నంత‌పురంలోని అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌న సంప‌ద‌లు ఉన్న దేవాల‌యంగా కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఉన్న అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌యం చ‌రిత్ర‌కెక్కింది. ఇంకా ఆ దేవాల‌యంలో ర‌హ‌స్య మాళిగ‌లు ఉన్నాయ‌ని.. అందులోనూ అపార ధ‌న‌రాశులు ఉన్నాయని స‌మాచారం. ఆ ఆరో గ‌ది త‌లుపులు తీస్తే ప్ర‌పంచం అంతం అవుతోంద‌నే క‌థ‌నాలు ఉన్నాయి. అలాగే ఆ ఆరో గ‌ది నుంచి స‌ముద్రంలోకి దారి ఉంద‌ని.. సముద్ర‌పు నీరు ముంచేస్తుంద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఇప్పుడు అచ్చం అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌యంలాగే ఒడిశాలోని పూరీ జ‌గ‌న్నాథుని శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో ఉన్న‌ సంపదపై చ‌ర్చ జ‌రుగుతోంది. అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌యంలో ఆరో గ‌దిలాగా పూరీ జ‌గ‌న్నాథుని దేవాల‌యంలోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై ఒడిశా రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది.

పూరీ జ‌గ‌న్నాథుని భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని అంటున్నారు. ఈ గదిలో అపార సంపద (వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు) ఉందని చరిత్రకారులు కూడా ఆధారాలు చూపుతున్నారు.

కాగా 1926లో నాటి బ్రిటిష్‌ పాలకులు పూరీ జ‌గ‌న్నాథుని రత్న భాండాగారం తెరిపించార‌ని స‌మాచారం. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆ ఆభరణాలను లెక్కించార‌ని తెలుస్తోంది. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను లెక్క‌ల్లో పేర్కొన్నారు. ఆ సంపదను వెలకట్టలేమని.. పూరీ జ‌గ‌న్నాథుని భాండాగారంలో రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్లు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ సురేంద్ర మిశ్ర ఇటీవల పూరీలో మీడియాకు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

ఈ రహస్య గది దిగువన సొరంగ మార్గం ఉందని.. దాని కింద మరిన్ని గదులున్నాయని 1926లో చెన్నె నిపుణులు తెలిపినట్లు సురేంద్ర మిశ్రా చెబుతున్నారు. తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్లలేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్లు ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్లు ఆయ‌న వివ‌రించారు.

కాగా 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ(ఒడిశా)ను పాలించిన 46 మంది రాజులు పూరీ జ‌గ‌న్నాథుడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్లు చ‌రిత్ర చెబుతోంది. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లోని అనంత ప‌ద్మనాభ‌స్వామి దేవాల‌యంలాగా పూరీలోని శ్రీ జ‌గ‌న్నాథుడి దేవాల‌యం కూడా దేశవ్యాప్తంగా సంచ‌ల‌నాత్మ‌కంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.