Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే సూసైడ్ అటెంప్ట్!... ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   17 March 2019 10:39 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే సూసైడ్ అటెంప్ట్!... ఏం జ‌రిగింది?
X
కీల‌క‌మైన ఎన్నిక‌ల ముంగిట ఏపీలో విప‌క్షం వైసీపీ త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. సింగిల్ జాబితాలోనే మొత్తం అసెంబ్లీ సీట్ల‌తో పాటు ఎంపీ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైరి వ‌ర్గాల‌కు గ‌ట్టి షాకే ఇచ్చార‌ని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఒక‌టి రెండు చోట్ల సిట్టింగుల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌... కొత్త అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కీల‌క‌మైన ఎన్నికలుగా ప‌రిగ‌ణిస్తున్నందున‌నే.. ప్ర‌తి సీటు కూడా కీల‌కంగా మారిన నేప‌థ్యంలోనే గెలుపు గుర్రాల‌ను ఎంచుకోవాల్సి వ‌చ్చింద‌ని, ఆ క్ర‌మంలోనే కొన్ని చోట్ల కొత్త అభ్య‌ర్థుల‌ను ఎంచుకోవాల్సి వ‌చ్చింద‌ని కూడా పార్టీ అధిష్ఠానం చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం జాబితా ప్ర‌క‌ట‌న‌కు ముందే... నిన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైసీపీలో కల‌క‌లం రేగింది.

చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యేగా ఉన్న డాక్ట‌ర్ సునీల్ కుమార్‌... ఈ ద‌ఫా త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌న్న భావ‌న‌తో ఏకంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. చేయి కోసుకోవ‌డంతో పాటుగా అధిక మోతాదులో మ‌త్తు ప‌దార్థాన్ని సేవించిన సునీల్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సునీలే... సెల్ఫీ వీడియోలో వెల్ల‌డించి మ‌రీ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. అయితే స‌కాలంలోనే స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు... ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స అంద‌జేశారు. ఈ క్ర‌మంలో ప్రాణాపాయం త‌ప్పిన సునీల్‌... ప్ర‌స్తుతం మ‌ద‌న‌ప‌ల్లిలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన సునీల్‌... ప్ర‌భుత్వ వైద్యాధికారిగా విధులు నిర్వ‌ర్తించేవారు. సునీల్ స‌తీమ‌ణి కూడా డాక్ట‌రే. గ‌డ‌చిన ఎన్నిక‌లకు ముందు చిత్తూరు జిల్లాలోని ప‌ల‌మ‌నేరులో వైద్యులుగా ప‌నిచేస్తూ మంచి పేరు గడించారు. ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో క్రియాశీల‌కంగా మారిన సునీల్... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పూత‌ల‌ప‌ట్టు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ స్థానం నుంచి విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా సునీల్ మాత్రం పార్టీతోనే సాగారు. అయితే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కూడా సునీల్ పూత‌ల‌ప‌ట్టు టికెట్ ను ఆశించారు. సిట్టింగ్ గా ఉన్న త‌న‌కే సీటు కేటాయించాల‌ని కూడా కోరారు. వాస్త‌వంగా సునీల్ పై పెద్ద‌గా అవినీతి ఆరోప‌ణ‌లు కూడా లేవ‌నే చెప్పాలి. అయితే కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుపుకుని ముందుకు సాగ‌డంలో సునీల్ అంత‌గా రాణించ‌లేక‌పోతున్నార‌ని తేలింద‌ట‌. దీంతో సునీల్ కంటే మెరుగైన అభ్య‌ర్థి కోసం చూసిన అధిష్ఠానం.. సునీల్ వాద‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ విష‌యం తెలుసుకున్న సునీల్‌... భార్య‌ను వెంట‌బెట్టుకుని మొన్నామ‌ధ్య వైసీపీ కేంద్ర కార్యాల‌యం లోటస్ పాండ్‌కు వెళ్లారు. అయితే అక్క‌డ లోట‌స్ పాండ్ లోకి అనుమ‌తి ద‌క్క‌క‌పోవ‌డంతో పాటు పెద్దిరెడ్డి లాంటి సీనియ‌ర్లు కూడా త‌న‌ను పట్టించుకోక‌పోవ‌డాన్ని సునీల్ అవ‌మానంగా భావించారు.

ఈ క్ర‌మంలోనే తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సునీల్‌.. ఇటీవ‌లే ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. జ‌గ‌న్ అంటే త‌న‌కు వల్ల‌మాలిన అభిమాన‌మ‌ని, అలాంటిది త‌న‌కు తీవ్ర అవ‌మానం జ‌రిగిపోయింద‌ని ఆ వీడియోలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా పార్టీ నేత‌లు త‌న‌ను అవ‌మానిస్తున్న తీరును త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని, అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని, నేరుగా జ‌గ‌న్ కే చెబుతున్న‌ట్లుగా ఓ సెల్ఫీ వీడియో తీసుకుని దానిని జ‌గ‌న్‌, ఇత‌ర పార్టీ నేత‌ల‌కు ఫార్వ‌ర్డ్ చేసి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. అయితే కుటుంబ స‌భ్యులు వేగంగా స్పందించ‌డంతో ఆయ‌న ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీలో పెను క‌ల‌కలం రేపుతోంద‌నే చెప్పాలి. సునీల్ ఆరోపిస్తున్న‌ట్లుగానే ఈ ద‌ఫా పూత‌ల‌ప‌ట్టు టికెట్ ను సునీల్ కు కాకుండా... ఎంఎస్ బాబుకు కేటాయించారు.