Begin typing your search above and press return to search.

భారత ప్రధానికి పుతిన్ అర్జెంట్ ఫోన్ కాల్.. విషయమెంటీ..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 3:30 PM GMT
భారత ప్రధానికి పుతిన్ అర్జెంట్ ఫోన్ కాల్.. విషయమెంటీ..!
X
ఉక్రెయిన్ పై రష్యా అణ్వస్త్ర ప్రయోగం చేస్తుందని అమెరికన్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తలు వెలువడిన రెండో రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే తాము అణ్వస్త్ర దాడి చేస్తామని రష్యా ఇటీవల ప్రకటించడంతో పుతిన్ కు మోదీ దూరంగా ఉంటున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి.

ఈ క్రమంలోనే పుతిన్-మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఆసక్తిని రేపుతోంది. అయితే వచ్చే ఏడాది భారత్ జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్రం ఇప్పటి నుంచే చేస్తోంది. ఈ సదస్సులో జీ 20 దేశాధినేతలు పాల్గొననున్నారు. సెప్టెంబర్ జరిగే ఈ సదస్సును బెంగూళూరు.. ముంబై.. జైపూర్లో నిర్వహించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.

జీ20లో సభ్య దేశాలుగా భారత్.. అమెరికా.. రష్యా.. చైనా.. అర్జెంటీనా.. ఆస్ట్రేలియా.. బ్రెజిల్.. కెనడా.. ఫ్రాన్స్.. జర్మనీ.. ఇండోనేషియా.. ఇటలీ.. జపాన్.. రిపబ్లిక్ ఆఫ్ కొరియా.. మెక్సికో.. సౌదీ అరేబియా.. దక్షిణాఫ్రికా.. టర్కీ.. బ్రిటన్.. భారత్ సహా యూరోపియన్ దేశాలున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయా దేశాల అధినేతలు.. ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. జీ 20 సదస్సు భారత్ అతిథ్యం ఇవ్వనుండటంపై పుతిన్ సంతోషం వ్యక్తం చేస్తూ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాదిలో జరిగే జీ 20 సదస్సులో పాల్గొంటానని పుతిన్ సూచనప్రాయంగా మోదీకి తెలియజేశారు.

ఈ సందర్భంగా జీ 20 అధ్యక్ష పదవీ దక్కడంలో సహకరించిన రష్యాకు సైతం మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఇటీవల షాంఘై కోఆపరేషన్లో ప్రస్తావనకు వచ్చిన పలు అంశాలపై మోదీతో పుతిన్ చర్చించారు. ఈ ఆర్గనైజేషన్లో భారత్.. రష్యా.. చైనా.. పాకిస్తాన్.. కజకిస్తాన్.. ఉజ్బెకిస్తాన్.. కిర్గిజిస్తాన్.. తజకిస్తాన్‌ దేశాలకు సభ్యత్వం ఉంది.

అయితే ఉక్రెయిన్ పై రష్యా అణ్వస్త్ర దాడికి సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో పుతిన్ కు మోదీ దూరంగా ఉంటారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ జీ 20 సదస్సు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి మోదీతో బుజ్జగింపులకు దిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై 500 టన్నుల పేలోడు సామర్థ్యం కలిగిన అణ్వస్త్ర క్షిపణిని ప్రయోగించేందుకు రష్యా సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్షిపణి రేంజ్ 12 వేల కిలోమీటర్లు కావడంతో దీని పరిధిలోని యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రానున్నాయి. దీంతో ఆ దేశాలన్నీ రష్యా అణ్వస్త్ర దాడి వార్తల నేపథ్యంలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.