Begin typing your search above and press return to search.

నిండు సభలో క్షమాపణలు చెప్పిన తెలంగాణ మంత్రి

By:  Tupaki Desk   |   12 March 2020 2:30 PM GMT
నిండు సభలో క్షమాపణలు చెప్పిన తెలంగాణ మంత్రి
X
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై చర్చ సాగుతోంది. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశాల్లో మంత్రి నిండుసభ లో క్షమాపణలు చెప్పారు. దీంతో ఆసక్తికరంగా మారింది. ఎందుకు చెప్పారు... సభలో ఏమైందనే ఆసక్తి అందరిలో రేగింది. తెలంగాణ శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో భాగంగా రవాణా, కార్మిక శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఓ విషయమై ప్రజాప్రతినిధులకు స్వయంగా క్షమాపణలు చెప్పారు.

శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సాగుతుండగా పలువురు సభ్యులు ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రశ్నలు వేశారు. ప్రజాప్రతినిధులుగా తాము ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు లిఫ్ట్ చేయడం లేదని సమావేశంలో ప్రస్తావించారు. పలు సమస్యలపై ఫిర్యాదు చేద్దామంటే అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, ఫోన్లు ఎత్తడం లేదని పేర్కొన్నారు. దీనిపై ఆ శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ స్పందించి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినప్పుడు ఆర్టీసీ అధికారులు ఫోన్లు లిఫ్ట్‌ చేయకపోవడం, ప్రతినిధులకు సమాచారం అందించకపోవడం ముమ్మాటికీ తప్పేనని స్పష్టం చేశారు. దీనికి వారి తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. అనంతరం తన ప్రసంగం కొనసాగించారు. ఇటీవలే బడ్జెట్ లో సమ్మె చేసిన కాలానికి జీతాలు చెల్లించడానికి రూ. 235 కోట్లు విడుదల చేసిన విషయం గుర్తుచేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల తో ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ రోజుకు కోటిన్నర లాభం పొందుతోందని ప్రకటించారు. గతంలో ఆర్టీసీకి రూ. 11 కోట్ల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.12.50 కోట్లు వస్తోందని వివరించారు. అవి మాత్రమే కాకుండా ఆర్టీసీ పార్సిల్‌ సర్వీసుల ద్వారా ఏడాదికి రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఉద్యోగులకు ఆర్టీసీ లో వచ్చే ఆదాయంతోనే జీతాలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల తో ప్రతి ఒక్క అధికారి సహకరించాలని కోరారు.