Begin typing your search above and press return to search.

ప్రశ్నించు పవన్... గర్జించు పవన్...?

By:  Tupaki Desk   |   4 April 2022 10:38 AM GMT
ప్రశ్నించు పవన్... గర్జించు పవన్...?
X
ప్రశ్నించడానికే పార్టీ అని పవన్ 2014లో జనసేన ఆవిర్భావ వేళ చెప్పారు. ఆయన ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో చాలా సార్లు ప్రశ్నించారు. అయితే ఇంకా ఆయన ప్రశ్నించాల్సిన అంశాలు కళ్ల ముందే ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో గంజాయి అక్రమ రవాణా సాగుతోంది అని కొద్ది నెలల క్రితం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాడు టీడీపీ నేత పట్టాభి వంటి వారు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మీద ఘాటు విమర్శలు చేసి అరెస్ట్ కూడా అయ్యారు.

నాడు పవన్ కూడా ఏపీలో మాదక ద్రవ్యాల రవాణా విచ్చలవిడిగా సాగిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్రమంగా గంజాయితో పాటు ఇతర మత్తు పదార్ధాలు కూడా రవాణా అవుతున్నాయని విమర్శించారు. వైసీపీ సర్కార్ కనుక జోక్యం చేసుకోకపోతే ఏపీ మత్తులో చిత్తు అవుతుందని నాడు అన్నారు.

అయితే ఏపీ సంగతి పక్కన పెడితే ఇపుడు విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. తాజాగా ఒక పబ్ లో 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఆ పబ్ లో డ్రగ్స్ సరఫరా అవుతోందన్న దాని మీద దర్యాప్తు చేపట్టడం జరిగాయి. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది సంచలనంగా మారింది.

ప్రముఖులు, సెలిబ్రిటీల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ న్యూస్ క్షణాలలో వైరల్ అయింది. మరి తెలంగాణాలో ఇది మొదటి సారి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ విషయంలో పోలీసులు దాడులు చేస్తే అక్కడ కూడా తన పార్టీని కొనసాగిస్తున్న పవన్ ఎందుకు మాట్లాడడం లేదు అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి.

పవన్ ప్రశ్నించడానికి ఇదే సరైన సమయం అని కూడా అంటున్నారు. పవన్ జనసేన మిత్ర పక్షం అయిన బీజేపీ అయితే ఈ అంశం మీద గట్టిగా పోరాటం స్టార్ట్ చేసింది. పలుకుబడి కలిగిన వారిని కేసు నుంచి పోలీసులు తప్పిస్తున్నారు అని కూడా ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అయితే తెలంగాణాలో డ్రగ్ కల్చర్ మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని ఘాటు కామెంట్స్ చేశారు.

మరి ఇంత జరుగుతూంటే జనసేన తరఫున పవన్ ఎందుకు ప్రశ్నించరు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇదే రకమైన దాడులు ఆంధ్రాలో జరిగితే ఈ పాటికి పవన్ కానీ జనసేన వారు కానీ చూస్తూ ఊరుకునేవారా అన్న చర్చ కూడా ప్రత్యర్ధి పార్టీలు ముందుకు తెస్తున్నాయి. మరి టీయారెస్ ప్రభుత్వం మీద జనసేన ఇప్పటిదాకా ఏ విమర్శా చేయలేదు అన్నది కూడా గుర్తు చేస్తున్నారు.

ఇక్కడ ఒక్క మాట. రాజకీయాలు కూడా కాదు కానీ, ఎక్కడైనా డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తే అది అతి పెద్ద ముప్పుగా మారుతుంది. యువతను ఏకంగా మత్తులో పడేస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ప్రపంచంలో భారత్ కి ఉన్న అతి పెద్ద మానవ వనరు, యువ సంపద నిర్వీర్యం అవుతుంది. అందుకే చిత్తశుద్ధి కలిగిన జనసేన లాంటి పార్టీలు ముందుకు వచ్చి ఇలాంటి అంశాల మీద పోరాడాలని అందరూ కోరుతున్నారు. మరి పవన్ ఏమంటారో.