Begin typing your search above and press return to search.

సినిమాల కోసం కూడా ఇంత క్యూ ఉండదేమో?

By:  Tupaki Desk   |   4 May 2020 9:01 AM GMT
సినిమాల కోసం కూడా ఇంత క్యూ ఉండదేమో?
X
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు నెలన్నర.. నాలుక పీక్కపోతోంది.మద్యం లేక బాడీ జీవచ్చవమైంది. కొందరు పిచ్చోళ్లు అయ్యారు. మరికొందరు కల్తీ కల్లు తాగి ఆస్పత్రిపాలయ్యారు. మద్యం దొరక్క మందు బాబులు పడిన కష్టం అంతా ఇంతా కాదయ్యా..

మద్యం లేక మందుబాబు పడుతున్న నరకయాతనకు సజీవ సాక్ష్యంగా ఏపీలోని వైన్స్ షాపులు నిలుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం ప్రియుల వేదనకు ముగింపు పడింది.తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి.కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు కొత్త కళ వచ్చింది. పొద్దు పొడవకముందే మద్యం షాపుల వద్ద క్యూలు కట్టిన వైనం విస్తుగొలిపింది. వైన్స్ షాపుల వద్ద మందు దొరుకుతుందో లేదోనని మద్యం ప్రియులు ఏకంగా వైన్స్ దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వైనం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రాంతంలో ఉదయం దుకాణాలు తెరువక ముందే మందుబాబు పడిగాపులు కాశారు. నెల్లూరు - చిత్తూరు - తిరుపతి - అనంతపురం - విజయవాడ తదితర జిల్లాల్లోని వైన్స్ షాపుల వద్ద ఇదేరకంగా మందుబాబులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలు చోట్ల కరోనా భయం లేకుండా బౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.

ఇప్పటికే పులి మీద పుట్రలా మందుబాబు దాహాన్ని క్యాష్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం 25శాతం ధరలను పెంచేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే మద్యం అమ్మకాలు కుదించింది. పెరిగిన మద్యం ధర అప్ డేట్ లు సీసాలపై లేకపోవడంతో అమ్మకాలు ఆలస్యమవుతున్నాయట.. దీంతో మందు బాబులు తమకు మద్యం దొరుకుతుందో లేదోనని ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వచ్చి కంట్రోల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.