Begin typing your search above and press return to search.

టీడీపీ, వైసీపీ, జనసేనలకు రఘువీరా కౌంటర్

By:  Tupaki Desk   |   3 Feb 2019 3:05 PM IST
టీడీపీ, వైసీపీ, జనసేనలకు రఘువీరా కౌంటర్
X
టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీ అమలుపై ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుందని మీడియా రఘువీరాను ప్రశ్నించగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విత్తనం ఇంకా మొలకెత్తలేదని కామెంట్ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి, వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ అని రెండు పార్టీల నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. అయినా రఘువీరారెడ్డి జనసేన ఇంకా మొలకెత్తలేదని అని చెప్పడంలో ఆయన అంతార్యం ఏంటో అర్థంకావడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా టీడీపీ, వైసీపీలకు చెందిన ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర సినిమాలపై రఘువీరా కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమా తొలి పార్ట్ మాత్రమే తీశారని రెండో పార్ట్ కూడా తీయాలని అప్పుడే ప్రజలకు అసలు నిజాలు తెలుస్తాయని అన్నారు. వైసీపీకి చెందిన ‘యాత్ర’పై స్పందిస్తూ వైసీపీలో వైస్ రాజశేఖర్ రెడ్డి సభ్యుడా కాదా అనేది కూడా చూపించాలని, ఆయన ఎప్పుడైనా వైసీపీలో ఉన్నారా లేని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయేంత వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ఆయన కల అని దానిని జగన్మోహన్ రెడ్డి నిజం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆ పార్టీలు కైవలం రాజకీయ లబ్ది కోసమే సగంసగం సినిమాలను ప్రజలపై రుద్దుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు నేతలు వలసలు పోతున్నా రాఘువీరా రెడ్డి మొండి ధైర్యం ఏంటో అర్థంకావడం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.