Begin typing your search above and press return to search.

రఘువీరా తారకమంత్రం: సోనియాను పిలుస్తా!

By:  Tupaki Desk   |   23 Sep 2015 3:48 AM GMT
రఘువీరా తారకమంత్రం: సోనియాను పిలుస్తా!
X
'నన్ను గనక గిచ్చావంటే.. వెళ్లి మా అమ్మకు చెప్తా' అంటూ చిన్నపిల్లలు తగాదా పడినట్లుగా ఉన్నది ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వైఖరి. 'సోనియా - రాహుల్‌ లను ఆహ్వానిస్తా' అనేది ఆయన పాలిట ఒక తారకమంత్రం అయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో చీమ చిటుక్కుమంటే చాలు.. సోనియాను పిలుస్తా.. ఇక్కడి ప్రజలకోసం ఉద్యమింపజేస్తా అంటూ రఘువీరా రాష్ట్రం నలుమూలల్లోని ప్రజలకు హామీలు గుప్పించేస్తున్నారు. సోనియా రావడం అనేది..రాష్ట్రానికి చెందిన ఒక సమస్య మీద ఆమె గళం విప్పి మాట్లాడడం అనేది సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా పీసీసీ చీఫ్‌ మాటలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం 5వేల ఎకరాల భూసేకరణ చేస్తుండగా దానికి వ్యతిరేకంగా పోరాడడానికి సోనియా రాహుల్‌ గాంధీలను ఇక్కడకు తీసుకువస్తా అంటూ పీసీసీ చీఫ్‌ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

సోనియా రాక అనేది.. పీసీసీ నాయకుడిగా ఆయనకు గొప్ప విషయం అయితే కావచ్చు గాక..! 'అమ్మా మీరు ఒకసారి వస్తే తప్ప మా రాష్ట్రంలోని సమస్యలు ఒక కొలిక్కి వచ్చేలా లేవు. అని పార్టీ అధినేత్రికి, లేదా యువరాజు రాహుల్‌ గాంధీకి విన్నవించుకుంటే.. వారు వచ్చేను రాకపొయ్యేను.. తద్వారా.. వారి గుడ్‌ లుక్స్‌ లో ఉండి.. పార్టీలో తన భవిష్యత్తును సుస్థిరంగా కాపాడుకోవచ్చుననేది' రఘువీరా గారి దూరాలోచన అయిఉండవచ్చు గాక! కానీ ఆచరణలో ఆయన సోనియాకు పంపే ఆహ్వానాలన్నీ ఫెయిలవుతూ ఉంటే.. ఏతావతా రాష్ట్రంలో ఆయన పరువు పోతుంది కదా.. అనే సంగతి ఆయన గుర్తించడం లేదు.

వ్యక్తిపూజలో తిరుగులేని ప్రమాణాలుసాధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు సోనియాను మించిన తారకమంత్రం ఉండదు. గతంలో రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లోనే ప్రత్యేక హోదా సాధించేస్తాం అంటూ ఉద్యమించిన కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో కూడా ఇదే బీరాలు పలికింది. కోటి సంతకాల ఉద్యమం చేస్తున్నాం అంటూనే.. సోనియాగాంధీని విజయవాడకు ఆహ్వానించి, ఆమెతో సభ నిర్వహింపజేసి.. ప్రత్యేకహోదాకోసం పీసీసీ పోరాడుతుందని అప్పట్లో రఘువీరా ప్రకటించారు. సోనియా ఆయన వినతుల్ని ఎంత మాత్రమూ పట్టించుకోలేదు. కనీసం రాహుల్‌ గాంధీ కూడా పట్టించుకోలేదు. అనంతపురానికి తాను షెడ్యూలు చేసుకున్న పాదయాత్రకు వచ్చినప్పుడు రాహుల్‌ ప్రత్యేకహోదా గురించి ఒక మాట మాట్లాడి వెళ్లిపోయారే తప్ప.. హోదా కోసం ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు చేసిందేమీ లేదు. అలా రఘువీరా ఒకసారి ఫెయిలయ్యారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ గురించి మళ్లీ అదే తరహా డైలాగులు వేస్తున్నారు. ఈసారి మాత్రం.. అసలు కాంగ్రెస్‌ పెద్దలు వీరి వద్దకు వస్తారా అనేది సందేహమే. ఇలా మరో నాలుగు సార్లు, సోనియా పేరు చెప్పడం.. మె రాష్ట్రానికి రాకుండా.. ఇగ్నోర్‌ చేయడం జరిగిందంటే.. పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని రఘువీరా తెలుసుకోవాలి.