Begin typing your search above and press return to search.

రాహుల్... వరుణ్.మళ్టీ స్టారర్ .... మోడీని ఢీ కొడతారా..?

By:  Tupaki Desk   |   20 Jan 2023 4:30 PM GMT
రాహుల్... వరుణ్.మళ్టీ స్టారర్ .... మోడీని ఢీ కొడతారా..?
X
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇపుడు పరిపక్వతతో కూడిన రాజకీయాలను చేస్తున్నారు అని అంతా ప్రశంసిస్తున్నారు. ఆయన 2004లో ఫస్ట్ టైం ఎంపీ అయిన నాటి నుంచి చూస్తే ఇపుడు బాగా పరిణతి చెందారు అని అంటున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా నేరుగా ప్రజలను కలుసుకుంటూ వస్తున్నారు. ఈ యాత్ర వల్ల మీరు ఏమి సాధించారు అంటే కొత్త రాహుల్ ని బయటకు తెచ్చానని మీడియాకు ఈ మధ్యనే సమాధానం ఇచ్చారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ చేపట్టిన ఈ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ తో గతంలో విభేదించిన వారు సైతం ఇపుడు రాహుల్ తో అడుగులు కదుపుతున్నారు. ఒకనాడు మోడీ చరిష్మా ముందు రాహుల్ సరితూగడని అన్న వారూ ఇపుడు రాహుల్ పెర్ఫెక్ట్ అంటున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రాజన్ సైతం రాహుల్ ది బెస్ట్ లీడర్ అని కొనియాడారు. ఆయన్ని పప్పు అని ఎందుకు అంటారో తెలియదు అని కూడా చెప్పుకొచ్చారు.

మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ రాహుల్ తో కలసి పాదయాత్రలో నడిచారు. విశ్వ నటుడు తమిళనాట తనకంటూ ఒక పార్టీని పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కమల్ హాసన్ సైతం రాహుల్ తో కలసి అడుగులు వేశారు. ఆయనతో వన్ టూ వన్ భేటీ అయి రాహుల్ నాయకత్వాన్ని మెచ్చుకున్నారు.

ఇలా చూస్తూ ఉంటే రాహుల్ ఇమేజ్ మారుతోంది. గ్రాఫ్ పెరుగుతోంది. గతంలో ద్వేషించిన వారు సైతం స్వాగతిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య మరో కొత్త చిత్రం కూడా తొందరలో చోటు చేసుకోబోతోంది అని అంటున్నారు. అదేంటి అంటే వరుణ్ గాంధీ కూడా రాహుల్ తో కలసి అడుగులు వేస్తారని, ఆయన పాదయాత్రలో పాలు పంచుకుంటారని.

నిజానికి వరుణ్ రాహుల్ కి తమ్ముడు. ఇద్దరు కజిన్స్. సంజయ్ గాంధీ మేనకా గాంధీల ఏకైక కుమారుడు వరుణ్. ఆయన 2009 లో బీజేపీ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు సార్లు ఎంపీగా యూపీ నుంచి ఉన్నారు. ఆయన తల్లి కూడా ప్రస్తుతం బీజేపీ ఎంపీ. బీజేపీకి ముందు సంజయ్ విచార్ మంచ్ పెట్టి జనతాదళ్ సహా అనేక విపక్ష పార్టీలలో మేనకాగాంధీ పనిచేశారు.

ఆమె వారసుడిగా బీజేపీ నుంచే వరుణ్ ఎంట్రీ ఇచ్చారు. అద్వానీ టైం లో వరుణ్ కి మంచి ప్రధాన్యత లభించినా మోడీ జమానాలో గుర్తింపు కరవు అయింది. గత ఎనిమిదిన్నరేళ్ళుగా కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్నా వరుణ్ కి మాత్రం కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. అలాగే యూపీ ఎన్నికల్లో కూడా ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తారా అన్న డౌట్ ఉంది.

ఇక మోడీ ప్రభుత్వ విధానాలను తరచూ ఎండగడుతూ సొంత పార్టీలో ఫైర్ బ్రాండ్ గా వరుణ్ మారిపోయారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్నది మాత్రం అర్ధం కాని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టెలోకి వరుణ్ గాంధీ చేరాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి నాందిగా అన్న రాహుల్ ని కలసి పాదయత్రలో పాలుపంచుకుంటే కొంత అనుకూలంత వస్తుందని, దాని మీద పెద్దమ్మ సోనియా గాంధీ కూడా ఓకే చెబితే కాంగ్రెస్ లో తన చేరికకు మార్గం సుగమం అవుతుంది అని వరుణ్ భావిస్తున్నారు అంటున్నారు.

తన తమ్ముడు తనతో కలసి పాదయాత్ర చేస్తే ఓకే కానీ తాను మాత్రం బీజేపీ ఆరెస్సెస్ విధానాలకు తల వంచను అని కరెక్ట్ గా చెప్పేశారు రాహుల్. వరుణ్ విషయంలో రాహుల్ ఆలోచనలు ఏంటి అన్నది ఆయన మాటల బట్టి తెలుస్తోంది. తమ ఇద్దరి పొలిటికల్ ఫిలాసఫీ వేరు అని రాహుల్ అంటున్నారు. మరి కాంగ్రెస్ ఫిలాసఫీయే తనది కూడా అని వరుణ్ అంటే ఆయన ఏమి చేస్తారు అన్నది చూడాలి. అసలు సోనియా గాంధీ దానికి అంగీకరిస్తారా అన్నది కూడా ఆలోచించాలి.

కాంగ్రెస్ లో రాహుల్ కి పోటీ ఎవరూ లేరు. వరుణ్ వస్తే ఏదో నాటికి పోటీ అవుతారు అన్నది కూడా ఆలోచిస్తారు. అదే సమయంలో వరుణ్ రాక బలం అన్న వారూ ఉన్నారు. ఇందిరమ్మ కడపున పుట్టిన రాజీవ్ సంజయ్ గాంధీల బిడ్డలు ఇద్దరూ కాంగ్రెస్ లో ఉంటూ మోడీని ఢీ కొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని అన్న వారూ ఉన్నారు. రాజకీయాలలో ఎపుడు ఏమైనా జరగవచ్చు. కాబట్టి అన్న దమ్ములు కలసి మోడీని బీజేపీని ఎదుర్కోవడమో ఉన్నదమ్ములు చూపిస్తారా అంటే వెయిట్ అండ్ సీ.