Begin typing your search above and press return to search.

మోడీకి ఘాటు ప్ర‌శ్న వేసిన రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   31 March 2017 11:01 PM IST
మోడీకి ఘాటు ప్ర‌శ్న వేసిన రాహుల్ గాంధీ
X
గత 18 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రైతులు పుర్రెలతో అర్ధనగ్నంగా ఆందోళన చేస్తున్న‌ తమిళనాడు రైతులకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. తమిళనాడు రైతులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బడాబాబులకు రుణమాఫీ చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, రైతుల రుణమాఫీపై లేదని రాహుల్ విమర్శించారు. తమిళనాడు రైతుల గోడు వినేందుకు ప్రభుత్వానికి గానీ, ప్రధానికి గానీ సమయం లేదా? అని ప్రశ్నించారు. విదేశీ ప‌ర్య‌ట‌న ముగిసిన త‌ర్వాత రాహుల్ గాంధీ రైతుల ప‌క్షాన గ‌ళం విప్ప‌డం, ఏకంగా ప్ర‌ధాన‌మంత్రిని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, రుణమాఫీ, కరువు సాయం కోసం తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 18 రోజులుగా దీక్ష చేస్తున్న వీరికి డీఎంకే ఎంపీ కనిమొళి - కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ సంఘీభావం ప్రకటించారు. రైతుల గోడు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు రైతులు కరువు బారిన పడ్డారని ఎంపీ కనిమొళి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వీరి పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్రానికి కరువు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/