Begin typing your search above and press return to search.

రాహుల్ నోట ఆ మాట.. ఆ సీఎంను తప్పించేందుకేనా?

By:  Tupaki Desk   |   23 Sep 2022 4:34 AM GMT
రాహుల్ నోట ఆ మాట.. ఆ సీఎంను తప్పించేందుకేనా?
X
ఒకప్పుడు భారత దేశ మ్యాప్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవి? అని చూసినప్పుడు.. ఏవి కాదు చెప్పండి? అన్నట్లుగా విస్తరించి ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాస్తంత పెద్దదైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క రాజస్థాన్. ఛత్తీస్ గఢ్ కూడా ఉన్నప్పటికి.. పేద రాష్ట్రమన్నది మర్చిపోకూడదు. అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. మహారాష్ట్రంలో మొన్నటివరకు సంకీర్ణంలో ఉన్నా అదిప్పుడు లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు ఇప్పుడు దారుణమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

అయినప్పటికి అంతర్గత కుమ్ములాటల నుంచి ఆ పార్టీ బయటకు రావట్లేదు. పార్టీ తీరు మార్చేందుకు వీలుగా రాహుల్ గాంధీనే స్వయంగా రంగంలోకి దిగటం.. భారత్ జోడో యాత్ర పేరుతో దేశం మొత్తం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ సానుకూలత పాదయాత్ర కారణంగా పార్టీకి వస్తున్నా.. దాన్ని మరింత పెంచే విషయంపై పార్టీ నేతల సహకారం పెద్దగా ఉండటం లేదంటున్నారు. ఓవైపు పాదయాత్ర చేస్తున్న రాహుల్.. పార్టీ వ్యవహారాల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఆయన వ్యూహాల్ని పన్నాల్సి వస్తోంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నేతను ఆ పీఠం మీద కూర్చోబెట్టాలని డిసైడ్ చేయటం తెలిసిందే. దీనికి తగ్గట్లే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ కు ఈ పదవిని అప్పజెప్పి.. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ను తప్పించాలన్నది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే బ్యాక్ గ్రౌండ్ నడుస్తోంది. చేతిలో ఉన్న ముఖ్యమంత్రి పదవికే అశోక్ గెహ్లాత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కంటే కూడా.. సీఎం పదవే తనకు సరిపోతుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

తప్పదనుకుంటే రెండు పదవుల్ని చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్న ఆయనకు.. బ్రేకులు వేసేందుకు తాజాగా పాదయాత్రలో ఉన్న రాహుల్ నోటి నుంచి.. 'ఒకరికి ఒకటే పదవి' అన్న మాటను ఆయన చెప్పేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారికి తాను ఒకటే సలహాను ఇస్తానన్న రాహుల్.. "ఈ పదవి కేవలం సంస్థాగతమైనదే కాదు.. నిర్దిష్ట విలువలు, విశ్వసనీయ వ్యవస్థ, భారత దార్శనికతకు ప్రతిబింబమని గుర్తుంచుకోవాలి" అని వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. అంతకు ముందు అశోక్ గెహ్లాత్ మాట్లాడుతూ.. తాను రెండు పోస్టులు కాదు.. మూడు పోస్టులైనా నిర్వహించగలనని చెప్పటమే.

దీంతో.. ఆయన ఆలోచనలు ఆచరణ సాధ్యం కాదన్న విషయాన్ని రాహుల్ తన తాజా మాటతో స్పష్టం చేశారని చెప్పాలి. దీనికి తోడు.. సుదీర్ఘకాలంగా రాజస్థాన్ పార్టీలో ఉన్న అసమ్మతికి బ్రేకులు వేసి.. ఆ రాష్ట్రంలో అయినా మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. అందుకే..

అశోక్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టేలా పావులు కదిపి.. యువనేత సచిన్ పైలెట్ కు రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేస్తే లెక్కలు ఒక కొలిక్కి వస్తాయన్నది ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవి మీద ఏ మాత్రం ఆసక్తి చూపని అశోక్ గెహ్లాత్ .. తాను పోటీ చేయనని ఇదివరకే చెప్పినట్లుగా గుర్తు చేసినప్పటికీ.. తన మాటకు భిన్నంగా నామినేషన్ వేయనున్నట్లు తాజాగా చెప్పటం గమనార్హం. ఒకరికి ఒక పదవి అన్న మాటతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించటానికి అన్న సంకేతాన్ని తన మాటతో ఇచ్చిన రాహుల్.. ఆ పనిని తాను అనుకున్నట్లు చేయగలుగుతారా? అన్నదిప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.