Begin typing your search above and press return to search.

బీమా ధీమా కాదు జేబుకు చిల్లేనంట

By:  Tupaki Desk   |   5 March 2016 6:51 AM GMT
బీమా ధీమా కాదు జేబుకు చిల్లేనంట
X
రైల్వే బడ్జెట్ సందర్భంగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికులకు వరం లాంటి మాటను చెప్పినట్లు కనిపించింది. అయితే.. ఆయన మాటలు రైల్వే ప్రయాణికులకు వరం కాదని.. జేబుకు చిల్లు అన్న విషయం తాజాగా తేలిపోయింది. తాజాగా రైల్వే మంత్రి ఇచ్చిన సమాధానంతో రానున్న రోజుల్లో రైల్వే ప్రయాణికులకు వరంగా మారుతుందని భావించిన బీమా ధీమా.. జేబుకు చిల్లే తప్ప మరొకటి కాదని తేలిపోయింది.

రైల్వే ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా రైల్వే బడ్జెట్ లో మంత్రి పేర్కొన్నారు. దీంతో పలువురు సంతోషపడిపోగా.. మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. మంత్రిగారి నోటి వెంట బీమా మాటను ప్రత్యేకంగా ప్రస్తావించారంటే.. కచ్ఛితంగా ఏదో మతలబు ఉంటుందన్న భావన వ్యక్తమైంది. దీని లెక్క తేల్చేందుకు ఎంపీ ఒకరు పార్లమెంటులో ప్రశ్నను సంధించారు.

రైల్వే ప్రయాణికులకు బీమా లెక్కేంటో సరిగా చెప్పాలని కోరినప్పుడు మంత్రి బదులిస్తూ.. రైల్వే ప్రయాణ సమయంలో బీమా ధీమా కావాలంటే కచ్ఛితంగా ప్రీమియం కట్టాలని.. రైల్వే టిక్కెట్టుకు అదనంగా ఉండే ఈ మొత్తాన్ని కట్టిన వారికే బీమా ధీమా కల్పిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆరేడు కంపెనీలతో మాట్లాడుతున్నామని.. ఇవి ఒక కొలిక్కి వస్తే.. బీమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. అంటే.. ప్రతి టిక్కెట్టు మీద వసూలు చేసే బీమా ప్రీమియం రైల్వే శాఖకు భారీగా లబ్థి చేకూరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ​