Begin typing your search above and press return to search.

రాజస్థాన్ కాంగ్రెస్ రచ్చ మళ్లీ మొదలు.. ఈసారి పైలెట్!

By:  Tupaki Desk   |   2 Nov 2022 11:30 AM GMT
రాజస్థాన్ కాంగ్రెస్ రచ్చ మళ్లీ మొదలు.. ఈసారి పైలెట్!
X
అధికారం చేతిలో ఉన్నప్పుడు కొన్ని పైత్యాలు వచ్చేస్తుంటాయి. అలాంటి వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ట్రాక్ రికార్డు అంతా ఇంతా కాదు. కానీ.. అధికారం చేతి నుంచి చేజారిపోవటమే కాదు.. మళ్లీ ఎప్పటికి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వేళలోనూ.. దాన్ని దక్కించుకునే దాని కంటే కూడా.. డ్యామేజ్ చేసే పనుల మీద ఫోకస్ చేసే ధోరణి కాంగ్రెస్ నేతలకు ఎక్కువనే చెప్పాలి. ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ అన్న తేడా లేకుండా పార్టీని తరచూ ఇబ్బంది పెట్టే బ్యాచ్ కాసింత ఎక్కువే.

ఇవాల్టి రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్ని వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటి రాష్ట్రాల్లో కాస్త చెప్పుకోదగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ మాత్రమే. ఆ రాష్ట్రాన్ని అయినా సరిగా పాలించే దానిపై ఫోకస్ కంటే కూడా అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న దానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు.. ఆయన ప్రత్యర్థి వర్గం సచిన్ పైలెట్ కు మధ్య నడుస్తున్న వార్ తరచూ పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు.. ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిని సీనియర్ అయిన అశోక్ గెహ్లాత్ కు కట్టబెట్టి.. జూనియర్ అయిన సచిన్ పైలెట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేద్దామని అధినాయకత్వం భావించింది.

ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవి కంటే కూడా రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవే తనకు ముఖ్యమన్న రీతిలో వ్యవహరించిన అశోక్ గెహ్లాత్ తీరుతో గాంధీ ఫ్యామిలీ తన నిర్ణయాన్ని మార్చుకోవటం.. మల్లికార్జున ఖర్గేకు పగ్గాలు దక్కేలా చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా సచిన్ పైలెట్ మరోసారి గళం విప్పారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ తిరుగుబాటు చేసే వారిపై కచ్ఛితంగా చర్యలు తీసుకోవాలంటూ సచిన్ పైలెట్ మరోసారి రచ్చ మొదలు పెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజస్థాన్ లోని పార్టీలో కొందరు నేతలు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. గీత దాటిన వారిపై చర్యలకు కొత్త అధ్యక్షుల వారు ద్రష్టి పెట్టాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన వారిపై కొత్త అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలని.. రాజస్థాన్ లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి ముగింపు పలకాలని కోరారు. తాజాగాజరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ.. అశోక్ గెహ్లాత్ పై ప్రశంసలు కురిపించటం ఆసక్తికరంగా మారిందన్నారు. గతంలో గులాం నబీ అజాద్ ను కూడా పార్లమెంటులో మోడీ ఇలానే చేశారని.. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తాజా పరిణామాల్ని తేలిగ్గా తీసుకోకూడదన్న ఆయన.. గెహ్లాత్ మీద చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పార్టీ లైను దాటిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న సచిన్ పైలెట్.. ఈ విషయాన్ని పార్టీ అంతర్గత వేదికలో ప్రస్తావించే కన్నా.. బాహాటంగా చెప్పటం ద్వారా పార్టీ వ్యవహరాల్ని రచ్చగా మార్చటం తప్పించి మరింకేమీ చేస్తున్నది లేదు.

క్రమశిక్షణ చర్యలు కోరుతున్న ఆయన.. తాను చేస్తుందన్నదేమిటి? అన్న ప్రశ్న ఆయన తీరును చూసినప్పుడు కలుగక మానదు. ఓపక్క పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీని పట్టాల మీదకు ఎక్కించేందుకు పాదయాత్ర చేస్తుంటే.. సచిన్ పైలెట్ లాంటి వాళ్లు తాము కోరుకున్న ఎజెండా కోసం పడుతున్న తీరును చూస్తే.. కాంగ్రెస్ కు అసలు సమస్య ఎక్కడన్నది ఇట్టే అర్థం కాక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.