Begin typing your search above and press return to search.

మాట్లాడి నెత్తి మీద తెచ్చుకున్న నటి

By:  Tupaki Desk   |   21 Aug 2016 4:59 AM GMT
మాట్లాడి నెత్తి మీద తెచ్చుకున్న నటి
X
ఎప్పుడేం మాట్లాడాలన్న విషయం కూడా రాజకీయ నాయకులకు.. ప్రముఖులకు తెలీదా? ప్రజల మనోభావాలు.. తాజాగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన జాబితాలో మరో ప్రముఖురాలు చేరినట్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాయాది పాక్ ఎంత మంచి చేసినా మెచ్చుకోలేని పరిస్థితి. ఓపక్క దేశంలో కలకలం రేపేందుకు ఉగ్రవాదుల్ని పంపుతూ.. కశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్న పాక్ ను సమర్థించే వారు లేనట్లే.

సైద్ధాంతికంగా రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ అందుకోసం దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా మాట్లాడకూడదు. కానీ.. ఆ సోయి మరచిని ఒక ప్రముఖురాలు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. సినీ నటిగా.. కర్ణాటక కాంగ్రెస్ నేతగా.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ శిష్యురాలిగా పేరొందిన రమ్య తాజాగా చేసిన ప్రకటన ఇప్పుడు వివాదంగా మారింది.

ఇటీవల అమ్మడు పాకిస్థాన్ కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెకు ఘనమైన మర్యాదలు చేశారు. తనను చూసుకున్న తీరుకు ముచ్చటపడిపోయిన ఆ అమ్మడు పాకిస్థాన్ ను తెగ పొగిడేస్తోంది. పాకిస్థాన్ కు వెళితే నరకానికి వెళ్లినట్లని రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనటం సరికాదని మంట పుట్టే మాటను చెప్పుకొచ్చింది. గతంలో ఎంపీగా గెలిచిన ఈ అమ్మడు.. తర్వాత జరిగిన ఎన్నికల్లో అడ్డంగా ఓడిపోయింది. తనకున్న అరకొర రాజకీయ అవగాహనతో పాక్ మీద కాంప్లిమెంట్లు ఇచ్చేసిన ఆమె అడ్డంగా దొరికిపోయింది.

‘‘మనం ఇక్కడ బతుకుతున్నామో వాళ్లూ అలానే బతికేస్తున్నారు. అది చాలా మంచి దేశం. అక్కడికి వెళ్లిన వారిని బాగా చూసుకుంటారు’’ అంటూ అవసరానికి మించి పొగిడేసింది. ఒకవేళ అంతే మంచిదేశమైతే.. మన నుంచి కశ్మీర్ ను ఎలా ఆక్రమించినట్లు? దేశంలో పలు ఉగ్రవాద కార్యకలాపాల్ని ఎందుకు నిర్వహించినట్లు? పెద్ద ఎత్తున అమాయకుల ప్రాణాల్ని తీయటమే కాదు.. నేటికీ సరిహద్దుల్లో బాధ్యతారాహిత్యంతో కాల్పులు జరిపి సైనికుల ప్రాణాల్ని ఎందుకు తీస్తున్నట్లు? చూస్తుంటే..రాహుల్ శిష్యురాలికి పేపర్ చదివే అలవాటు లేనట్లుగా ఉంది.