Begin typing your search above and press return to search.

ఘ'రానా కపూర్'..

By:  Tupaki Desk   |   24 April 2022 9:31 AM GMT
ఘరానా కపూర్..
X
హవాలా.. మూడో కంటికి తెలియకుండా అవినీతి.. భారత రాజకీయాల్లో సర్వ సాధారణం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇవి కనిపిస్తుంటాయి. ఎక్కువగా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటుంది. ఆ పార్టీ ఏలుబడిలో దేశంలో వెలుగుచూసిన అనేక కుంభకోణాల్లో వీరే ఎక్కువగా ఉండేవారు. బోఫోర్స్ వంటి వాటిలో మాత్రమే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు వినిపించింది. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పేరు ఓ కుంభకోణంలో ప్రముఖంగా కనిపిస్తోంది. అయితే, అది మరీ రూ.2 కోట్ల విలువైన స్కాం మాత్రమే. ఇందులో నేరుగా సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ పేర్లుండడం చర్చనీయాంశమైంది.

ఇంతకూ ఏం జరిరిగింది..

రాణా కపూర్.. యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరైన ఆయన శనివారం కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నుంచి రూ.2 కోట్లతో ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్‌కు సంబంధించిన పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని తనను బలవంతం చేసినట్లు ఆరోపించారు.

యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా ఈ మేరకు తనపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. బదులుగా తనకు పద్మభూషణ్ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఈడీ ప్రస్తావించింది.

కాగా, దివాన్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ (DHFL) సంస్థకు ఆర్థిక సహాయం అందించేందుకు నేరపూరితంగా వ్యవహరించడంతో పాటు ప్రతిగా రూ.600 కోట్లు లబ్ధి పొందారనే ఆరోపణలతో ఈడీ, సీబీఐ రాణా కపూర్, ఆయన కుటుంబం, డీహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్‌ కపిల్ వాధ్వాన్‌లపై వేర్వేరుగా కేసు నమోదు చేశాయి. ప్రస్తుతం రాణా కపూర్‌ జ్యుడీషియల్‌ కస్టడిలో ఉన్నారు. రాణా కపూర్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్, ధీరజ్‌ వాధ్వాన్‌లు అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.5,050 కోట్ల నగదును అక్రమంగా బదిలీ చేశారని ఈడీ తాజాగా ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొంది.

ఆ డబ్బు సోనియా చికిత్సకు..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 2014 లో క్యాన్సర్ కు గురయ్యారు. దీనికిగాను ఆమెకు అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందారు. తానిచ్చిన రూ.2 కోట్లను సోనియా చికిత్సకు వినియోగించినట్లు మురళీ దేవరా తనయుడు మిలింద్‌ దేవరా ఓ సందర్భంలో రహస్యంగా తెలిపినట్లు రాణా కపూర్ చెప్పారు. అయితే తనకు మాత్రం పద్మభూషణ్ రాలేదని వాపోయారు.

సోనియా కుటుంబానికి చాలా మంచి చేశానని దివంగత అహ్మద్పటేల్ కొనియాడారని.. పద్మ భూషణ్ వస్తుందని చెప్పారని పేర్కొన్నారు. వాస్తవానికి తనను రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేలా బలవంత పెట్టారని రాణా కపూర్ చెప్పారు. ఈ మేరకు రాణా పేర్కొన్నట్లు ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. రాణా కపూర్‌ ఆరోపణల్ని కాంగ్రెస్‌ ఖండించింది. దివంగతులైన వారి (మురళీ దేవరా, అహ్మద్‌ పటేల్‌)పై ఆరోపణలు చేశారని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. రూ.5,000 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం అని అన్నారు.