Begin typing your search above and press return to search.

ఆరుసార్లు గెలిచిన చింతాకు ఆస్తుల్లేవ్.. గురుమూర్తికి కారు లేదు.. రత్నప్రభకు మాత్రం?

By:  Tupaki Desk   |   30 March 2021 4:30 AM GMT
ఆరుసార్లు గెలిచిన చింతాకు ఆస్తుల్లేవ్.. గురుమూర్తికి కారు లేదు.. రత్నప్రభకు మాత్రం?
X
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్న తిరుపతి ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అధికార వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్.. బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ.. టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి వనబాక లక్ష్మీ బరిలో ఉండటం తెలిసిందే.

తాజాగా వారు దాఖలు చేసిన నామినేషన్లలో వెల్లడించిన ఆస్తులు ఆసక్తికరంగా మారాయి. అన్నింటికి మించి తొమ్మిదిసార్లు తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేసి.. ఆరుసార్లు విజయం సాధించిన చింతా మోహన్ కు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవని పేర్కొనటం విశేషం. ఆయన తన వార్షిక ఆదాయం రూ.6.10 లక్షలుగా పేర్కొన్నారు. కాకుంటే.. ఆయన కుటుంబానికి రూ.3.27కోట్ల ఆస్తులు ఉన్నాయని.. అవన్నీ ఆయన సతీమణి చింతా రేవతి పేరుతో ఉన్నాయి.

వీటిల్లో రూ.2లక్షల నగదు.. రూ.14.40లక్షలు విలువ చేసే బంగారం.. తిరుపతిలో 20 సెంట్ల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. దాని విలువ రూ.1.20కోట్లుగా అఫిడవిట్ లో వెల్లడించారు. అంతేకాదు.. తిరుపతి రామచంద్రనగర్ లో రూ.95 లక్షల విలువైన కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎస్ బీఐ లో రూ.19.11లక్షల అప్పు ఉన్నట్లు వెల్లడించారు.

వైసీపీ అభ్యర్థి తన కుటుంబ ఆస్తులు రూ.47.25లక్షలుగా పేర్కొన్నారు. ఆయన పేరుతో రూ.10.66 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. భార్య నవ్యకిరణ్ పేరు మీద రూ.24.92లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. గురుమూర్తి సతీమణి పేరు మీద రూ.7లక్షల విలువైన కారు ఉండగా.. ఆయనకంటూ సొంత కారు లేదు. ఏర్పేడు మండలంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి.. 2610 చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ.5లక్షలుగా పేర్కొన్నారు. అప్పులేమీ లేవని పేర్కొన్నారు.

బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ తమ కుటుంబ ఆస్తుల విలువ ర.24.68 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రత్నప్రభ ఆస్తుల విలువ రూ.19.57 కోట్లు కాగా.. ఆమె భర్త పేరుతో రూ.5.10కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే..ఆమె చేతిలో నగదు మాత్రం రూ.25వేలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు మాత్రం రూ.2.81 కోట్లు ఉన్నాయని.. బాండ్ల రూపంలో రూ.28వేలు.. పోస్టాఫీసులో రూ.4లక్షల డిపాజిట్ల ఉన్నాయి. రూ.52లక్షల విలువైన బంగారం.. రూ.1.95లక్షల విలువైన వెండి ఉన్నాయి.

రూ.3 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి.. రూ.16లక్షల విలువైన రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆమె భర్త విద్యాసాగర్ పేరుతో కోటి రూపాయిలు విలువైన చరాస్తులు.. రూ.4.10 కోట్లవిలువైన స్థిరాస్తులు ఉన్నాయి.బ్యాంకులో రూ.17.30లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.