Begin typing your search above and press return to search.

రావెల రాటు దేలుతున్నారు

By:  Tupaki Desk   |   25 Jun 2015 8:39 AM GMT
రావెల రాటు దేలుతున్నారు
X
ఐఎఎస్‌ అధికారింగా ఉండి.. ఆపై రాజకీయాల్లోకి వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన రావెల కిషోర్‌బాబుకు లెక్కల ఆధారంగా చంద్రబాబు మంత్రిపదవిని ఇచ్చేశారు. మొదట్లో కాస్తంత తడబాటుతో పాటు.. పొరపాట్లు చేయటం.. ముఖ్యమంత్రి అసంతృప్తికి గురి కావటం జరిగింది.

ఆ తర్వాత సర్దుకున్న ఆయన.. ఈ మధ్య మాటలతో దూసుకుపోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో ఎవరు స్పందించినా.. స్పందించకున్నా రావెల మాత్రం రియాక్ట్‌ కావటం తెలిసిందే. సెక్షన్‌ 8కి సంబంధించి తాజాగా రచ్చ చోటు చేసుకోవటం తెలిసిందే. సెక్షన్‌ 8ని అమలు చేయాలని ఏపీ నేతలు.. ఏ మాత్రం అక్కర్లేదని తెలంగాణ అధికారపక్ష నేతలు పోటాపోటీగా మాటలు అనుకోవటం తెలిసిందే.ఈ నేపథ్యంలో సెక్షన్‌ 8 అవసరం ఎంత ఉందన్న విషయాన్ని రావెల తన మాటల చాతుర్యంతో చెప్పే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్‌లోని ఏపీ ప్రజల ఆస్తులకు భద్రత లేదని.. ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాష ఏమాత్రం బాగోలేదని.. సభ్య సమాజం అంగీకరించలేనంతగా ఆయన భాష ఉంటోందని చెప్పారు. ఏపీ విపక్ష నేత.. తెలంగాణ అధికారపక్షంతో చేతులు కలిపిందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు అభివృద్ధి మీద దృష్టి పెడితే.. తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ విపక్ష నేత జగన్‌ మద్ధతు పలుకుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మొత్తానికి అధినేత మనసును దోచుకునేలా మాట్లాడటంలో రావెల రాటు తేలారని చెప్పక తప్పదు.